
కరోనా వైరస్ ఎఫెక్ట్:
ఐపీఎల్లో టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ఆడేందుకు మరికొద్ది రోజుల్లోనే వివిధ దేశాల ఆటగాళ్లు ఆయా జట్లతో కలవడానికి భారత్కి రానున్నారు. కానీ.. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని దేశాలకి చెందిన క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లని భారత్కి పంపడంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం తెలుస్తోంది.

పునరాలోచనలో న్యూజిలాండ్ బోర్డు:
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తమ క్రికెటర్లకి అప్డేట్స్ ఇస్తోందట. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి సమాచారం సేకరిస్తుందట. ఇప్పటికే భారత్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతోనే ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు రానున్న క్రికెటర్లని న్యూజిలాండ్ బోర్డు అలర్ట్ చేస్తోంది. కివీస్ ఆటగాళ్లను భారత్కు పంపాలా వద్దా అని పునరాలోచనలో న్యూజిలాండ్ బోర్డు ఉన్నట్టు సమాచారం.

ఎనమిది ప్రాంచైజీలకు ఆరుగురు క్రికెటర్లు:
ఐపీఎల్ 2020 సీజన్లో ఎనమిది ప్రాంచైజీలకు కలిపి మొత్తం ఆరుగురు న్యూజిలాండ్ క్రికెటర్లు ఆడనున్నారు. కేన్ విలియమ్సన్ (సన్రైజర్స్ హైదరాబాద్), జిమ్మీ నీషమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), లూకీ ఫర్గూసన్ (కోల్కతా నైట్రైడర్స్), మిచెల్ మెక్లనగాన్ (ముంబై ఇండియన్స్), ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్), మిచెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్లకు ఆడనున్నారు.

ప్రేక్షకుల్లేకుండా:
ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రముఖ క్రీడా ఈవెంట్లు రద్దు కావడమో లేక వాయిదా పడటమో జరిగాయి.. జరుగుతున్నాయి. ఇటలీలోనైతే ప్రేక్షకుల్లేకుండా ఫుట్బాల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆదేశ ప్రభుత్వం మేజర్ క్రీడా ఈవెంట్లన్నిటిని, ముఖ్యంగా సాకర్ గేమ్స్ను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించింది. ప్రాచీన గ్రీస్ సాంప్రదాయ పద్దతిలో వచ్చే వారం జరిగే టోక్యో 2020 ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా సాధాసిదాగా జరగనుంది. ఎప్పుడూ అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షక సమూహం లేకుండానే నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications












