ఆరుగురికి పాజిటివ్
అండర్ 19 వన్డే ప్రపంచకప్లో ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. మ్యాచ్కు కొన్ని గంటల ముందు కెప్టెన్ యష్ ధూల్తోపాటు వైస్ కెప్టెన్, తెలుగు కుర్రాడైన షేక్ రషీద్కు పాజిటివ్కు తేలింది. అంతకు ముందే వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్లకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
వీరందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా నిర్ధారించింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్లో ఉన్నారు. దీంతో కరోనా సోకిన వారిని పక్కన పెడితే రిజర్వ్ ఆటగాళ్లతో కలిపి 11 మంది ఆటగాళ్లు మిగిలారు. అయితే కరోనా సోకిన ఆటగాళ్లు అంతా తర్వాతి మ్యాచ్కు అందుబాటులో ఉండడం కూడా కష్టంగానే ఉంది.
వెనక్కి తగ్గని యంగ్ ఇండియా
ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకినప్పటికీ యంగ్ ఇండియా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతో కలిపి సరిగ్గా 11 మంది ఆటగాళ్లు ఉండడంతో ఐర్లాండ్తో మ్యాచ్లో బరిలోకి దిగింది. ఆల్రౌండర్ నిశాంత్ సిద్ధు ఈ మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్పై 174 పరుగుల భారీ తేడాతో యువ భారత్ ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ 88 పరుగులతో, రఘువంశీ 79 పరుగులతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్ ఏకంగా 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మిగతావారిలో రాజ్బావ 42, రాజ్వర్ధన్ 39, నిశాంత్ సింధు 36 పరుగులతో రాణించారు.
కుప్పకూలిన ఐర్లాండ్
అనంతరం 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ అండర్ 19 జట్టు.. టీమిండియా బౌలర్ల ధాటికి 133 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో తాంబే, గౌతమ్, సంగ్వాన్ రెండేసి వికెట్లు తీశారు. విక్కీ, రవి కుమార్, రాజవర్దన్ తలో వికెట్ తీశారు. భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లలో ఒక్కరూ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు.
ఐర్లాండ్ బ్యాటర్లలో స్కాట్ మక్బెత్ 32, జాషువా కాక్స్ 28, మాథ్యూ హంఫ్రీస్ 16, టిమ్ టెక్టర్ 15, నాథన్ మెక్గ్యురే 14 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ కూడా రెండంకెల స్కోర్ చేయలేక పోయారు. కాగా యువ భారత్ తన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాపై గెలిచిన సంగతి తెలిసిందే.