బెంగళూరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తాత్కాలికంగా మూతపడింది. బెంగళూరులోని సాయ్ సంస్థలో పనిచేసే ఒక సీనియర్ వంట మనిషి కరోనా వైరస్ మహమ్మారితో మృతిచెందటంతో సాయ్ మూతపడింది. దీంతో క్రీడా కార్యకలాపాలను పునః ప్రారంభించే అవకాశాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సాయ్ సెంటర్ భారతీయ పురుషులు మరియు మహిళల హాకీ జట్లకు ఆతిథ్యం ఇస్తోంది.
జరిగిందేదో జరిగిపోయింది.. ధోనీ అభిమానులు నన్ను క్షమించండి: మాజీ క్రికెటర్
విషయంకి వెళితే... లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా గత శుక్రవారం సాయ్లోని వంటశాలను తెరిచేందుకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంటమనిషితో పాటు సుమారు 25 నుంచి 30 మంది అధికారులు హాజరైనట్లు సమాచారం తెలుస్తోంది. సమావేశానికి హాజరైనప్పుడు సదరు వంటమనిషి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని సాయ్ అధికారులు తెలిపారు.
అనంతరం సోమవారం సదరు వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని.. ఆ మరుసటిరోజే గుండె నొప్పితో మృతి చెందినట్లు సాయ్ అధికారులు తెలిపారు. అయితే మృతదేహానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో సదరు వంటమనిషికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశం అనంతరం భారతీయ మహళా హాకీ జట్టు కూడా అదే హాలులో సమావేశమయ్యింది.
వంటమనిషికి కరోనా పాజిటివ్ రావడంతో సమావేశానికి హాజరైన అధికారులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్కు పంపించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని సంబంధిత అధికారులు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేంద్రంలో భారత పురుషులు, మహిళల హాకీ జట్లు బస చేస్తున్నాయి. వీరితో పాటు అథ్లెటిక్స్ స్క్వాడ్లోని పది మంది సభ్యులు, 15 మంది సాయ్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే కేంద్రంలో నివసిస్తున్నారు. అయితే వీరు ఉన్న ప్రదేశంలో ఇతరులెవరికీ అనుమతి లేని కారణంగా.. క్రీడాకారులను వేరే చోటుకు పంపాల్సిన అవసరం లేదని సాయ్ ఉన్నతాధికారులు తెలిపారు.