టీ20 వరల్డ్ కప్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు వస్తున్న వార్తలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించాడు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పాడు. మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, మైకేల్ వాన్తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న హిట్మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుతో పాటు రిషభ్ పంత్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్ గురించి రోహిత్ మాట్లాడాడు.
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్లో రోహిత్తో కలిసి కోహ్లి భారత్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని, బ్యాకప్ ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఎంపికవుతాడని ప్రచారం జోరుగా సాగింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ..టీమిండియా సెలక్టర్లు, కోచ్ను ఇంకా కలవలేదని, భారత జట్టును ఎలా ఖరారు చేస్తామని అన్నాడు. ''నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ దుబాయ్లో ఎక్కడో ఉంటూ గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లల ఆటను చూస్తున్నాడు. నిజాయతీగా చెప్పాలంటే మేం ఇప్పటివరకు కలుసుకోలేదు''

''ఇవాళ లేదా భవిష్యత్లో.. ఎప్పుడైనా సరే, నేను, ద్రవిడ్, అగార్కర్ లేదా బీసీసీఐ తరఫున ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి చెప్పే వరకు ఏ విషయాన్ని నమ్మకండి. అప్పటివరకు ఇవన్నీ ఫేక్ న్యూసే. ఇక పంత్ విషయానికొస్తే.. అతను ఓ క్రేజీ పర్సన్. నన్ను ఎవరైనా నవ్విస్తారంటే అది అతనే. ప్రమాదం అనంతరం అతను క్రికెట్కు దూరమవ్వడంతో నిరాశకు గురయ్యాను.ఇప్పుడు అతను తిరిగిరావడం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైనా నవ్వాలనుకుంటే అతన్ని పిలుస్తాను'' అని రోహిత్ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్ స్థానం గురించి గిల్క్రిస్ట్ అడగ్గా.. రోహిత్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ''గత మ్యాచ్లో ధోనీ నాలుగు బంతులు ఆడటానికి క్రీజులోకి వచ్చాడు. కానీ అతను ఎంతో ప్రభావం చూపించాడు. ఇంపాక్ట్ ఆటతో రెండు జట్ల మధ్య వ్యత్యాసాన్ని తీసుకువచ్చాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో ఆడటం కోసం ధోనీని వెస్టిండీస్కు రమ్మని పిలవడం చాలా కష్టం (నవ్వుతూ). కానీ గోల్ఫ్ ఆడటం కోసం అతడు అమెరికాకు వస్తాడు. అయితే వరల్డ్కప్కు ధోనీని ఒప్పించడం కంటే దినేశ్ కార్తీక్ను కన్విన్స్ చేయడం చాలా ఈజీ'' అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.