Shama Mohamed: భారత క్రికెటర్ మహ్మద్ షమీ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగింది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మహ్మదీ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. ఈ మ్యాచ్ పవిత్ర రంజాన్ మాసంలో జరిగింది. 34 ఏళ్ల మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ సేవించడం చూసిన ముస్లిం మతపెద్ద మౌలానా షాబుద్దీన్ రజ్వే బరేల్వీ.. ఉపవాసం ఉండనందుకు షమీని "క్రిమినల్" అని అన్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ షమీని సమర్థించారు.
రోజా వివాదంపై షామా మహ్మద్ ఏమన్నారంటే?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని, అసమర్థుడైన కెప్టెన్ అని విమర్శించిన తర్వాత షామా మహ్మద్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షమీ తరపున మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచారు. షామా మహ్మద్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "రంజాన్ సందర్భంగా ఇస్లాంలో చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం ప్రయాణిస్తున్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మహ్మద్ షమీ ప్రయాణిస్తున్నాడు. అతను తన ఇంట్లో లేడు. అతను చాలా దాహం వేసే ఆట ఆడుతున్నాడు. క్రీడలు ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవరూ పట్టుబట్టరు. చేసే పనులే చాలా ముఖ్యమైనవి." అని షామా మహ్మద్ షమీని సమర్థించారు.

షమీని క్రిమినల్ గా ప్రకటించిన మౌలానా
ముస్లిం మతపెద్ద అయిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. మహ్మద్ షమీని క్రిమినల్ అంటూ ప్రకటించాడు."ఇస్లాంలో ఉపవాసం చేయడం బాధ్యత. ఎవరైనా ఉపవాసం చేయడం ఉద్దేశపూర్వకంగా మానేస్తే.. వారు పాపులతో సమానం. రంజాన్ మాసం రోజా(ఉపవాసం) ఉండడం అనేది తప్పక పాటించాల్సిన బాధ్యత. ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ రోజాను పాటించకపోతే వారు నేరస్థులు అవుతారు. భారత క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా ఏదో డ్రింక్ తాగాడు. షమీ ఆట ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఆరోగ్యంగా ఉన్న షమీ ఉపవాసం ఎందుకు చేయలేదు.అతడు పాపం చేశాడు. కాబట్టి అతడు నేరస్థుడు." అని మౌలానా షాబుద్దీన్ అన్నారు.
షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. భారత జట్టులోని కీలక బౌలర్లలో షమీ ఒకడు. చాలా సందర్భాలలో షమీ తన బౌలింగ్ తో జట్టును విజయపథంలో నడిపించాడు. సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. స్టీవ్ స్మిత్ ను ఔట్ చేయడం ద్వారా షమీ మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోపీలో 8 వికెట్లు తీసుకున్నాడు.