
ఏకంగా 15 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఐసీసీ ప్రకటించిన జట్టు ర్యాంకింగ్స్లో భారత్ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.
ఫైనల్లో ఆసీస్ విజయం సాధించడంతో టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు వచ్చి చేరాయి. 126 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానం సొంతం చేసుకోగా, అదే రేటింగ్ పాయింట్లున్న ఆస్ట్రేలియా 0.19 వ్యత్యాసం కారణంగా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక, 122 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీసేన తొలి టీ20లో నెగ్గగా, బుధవారం రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ర్యాంకులో ఏమాత్రం తేడా ఉండదు. ఒక వేళ సిరీస్ను కోహ్లీసేన 2-1తో చేజార్చుకుంటే మాత్రం పాయింట్లు కోల్పోతుంది.