హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అసలైన పరీక్ష ముందు ఉందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. 2018లో కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేమ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
దక్షిణాఫ్రికా సిరిస్లో కోహ్లీ కఠిన పరీక్ష ఎదుర్కొంటాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పిచ్ల్లో కోహ్లీ రాణించడం అంత సులభం కాదని, అదే అతని బ్యాటింగ్ సత్తాకు సవాల్గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని స్మిత్ పేర్కొన్నాడు.

'దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, కేశవ్ మహారాజ్లను కోహ్లీసేన ఎలా ఎదుర్కొంటుందో కూడా ఆసక్తికరం. మరోవైపు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి డేల్ స్టెయిన్ తిరిగొచ్చాడు. టీమిండియాపై అంటే స్టెయిన్కు మంచి రికార్డు ఉంది' అని స్మిత్ పేర్కొన్నాడు.
భారత పర్యటనలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదని అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ ఏబీ డివిలియర్స్ తీసుకున్న నిర్ణయాన్ని స్మిత్ స్వాగతించాడు. అదే సమయంలో డు ప్లెసిస్కు వన్డే కెప్టెన్సీని అప్పచెబితే బాగుంటుందన్న డివిలియర్స్ అభిప్రాయాన్ని స్మిత్ సమర్ధించాడు.
టెస్టుల్లో, టీ 20ల్లో అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్న డు ప్లెసిస్కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మానసికంగా జట్టు పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు.