హైదరాబాద్; ఆస్ట్రేలియా క్రికెటర్లపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే స్లెడ్జింగ్కు మారుపేరు. మాటలతో కవ్విస్తూ, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు మాత్రం స్లెడ్జింగ్ జోలికి పోవడం లేదు.
ముఖ్యంగా కోహ్లీసేనతో ఆసీస్ క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగడం లేదు. ఇందుక గల కారణాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్తో మ్యాచ్లు జరిగే సమయంలో స్లెడ్జింగ్కు పాల్పడటం లేదని వ్యాఖ్యానించాడు.

ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ ఇటీవలే ముగిసిన ఐదు వన్డేల సిరిస్పై స్పందించాడు. 'వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయం ఆసీస్ ఆటగాళ్లలో ఉంది. దుర్భాషలాడితే ఐపీఎల్ ప్రాంఛైజీలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం వారికి తెలుసు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాదిలో ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం పెద్ద దుమారాన్నే లేపింది. బ్రేన్ ఫేడింగ్ కారణంగానే అలా చేశానని ఆ తర్వాత స్మిత్ వివరణ ఇచ్చుకున్నాడు.
ప్రస్తుత సిరీస్లో ఆసీస్ ఆటగాళ్లు సైలెంట్గా ఉండిపోవడానికి ఈ ఘటన కూడా కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు భారత్తో వన్డే సిరీస్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లపై అతిగా ఆధార పడటమే ఆ జట్టు పరాజయాలకు కారణమని సెహ్వాగ్ విశ్లేషించాడు.
'ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉంది. ఒకప్పటిలా ఆ జట్టు పటిష్టంగా లేదు. వార్నర్, స్మిత్, ఫించ్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. వీరు ముగ్గురిలోనూ స్మిత్ పెద్దగా ఆడటం లేదు. టెస్టు సిరీస్ తాలుకూ ఒత్తిడి వారిపై ప్రభావం చూపుతోందేమో' అని సెహ్వాగ్ తెలిపాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 రాంచీ వేదికగా శనివారం జరగనుంది.