
ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్లో బంతిపై ఉమ్మి రుద్దడాన్ని రద్దు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ శాతం ప్రతికూల స్పందనలే వస్తున్నాయి. వన్డే, టీ20 క్రికెట్లో ఉమ్మిని రద్దు చేసినా ఫర్వాలేదు కానీ.. టెస్టు క్రికెట్లో అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పేస్ బౌలర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. తాజాగా ఉమ్మి రద్దుపై టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్పందించాడు.
బంతిపై ఉమ్మి రాయకపోతే స్వింగ్ చేయడానికి ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభించదని, దీంతో మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఆధిపత్యం చెలాయిస్తారని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. అలా జరగకుండా బ్యాటు, బంతికి మధ్య మంచి పోటీ ఉండేలా నిర్వహించాలన్నాడు. 'ఎర్ర బంతిని షైన్ చేయకపోతే స్వింగ్ అవ్వదు. దీంతో బ్యాట్స్మెన్ సులువుగా ఆడతాడు. పోటీ న్యాయంగా ఉండాలి. బ్యాట్స్మెన్ ఆధిపత్యం చెలాయించేలా ఉండకూడదు' అని ఇషాంత్ అన్నాడు.
'అయితే ప్రస్తుత పరిస్థుతుల మధ్య బంతిపై లాలాజలాన్ని వాడకం నివారించాలి. కానీ మేం బంతి షైన్కు ఎక్కువగా అలవాటు పడ్డాం. కాబట్టి ప్రత్యేక చర్యలతో బంతి మెరుపు కోసం ప్రయత్నించాలి. టెస్టు క్రికెట్లో బంతిని షైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందుకు ఐసీసీ వేరే పద్ధతిని తీసుకురావాల్సి ఉంది' అని ఇషాంత్ తెలిపాడు. భారత్ తరఫున అతడు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు.
ఇటీవల జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'వికెట్లు తీసినప్పుడు కౌగిలింతలు, హైఫైవ్లు లేకుంటే ఇబ్బందేమీ లేదు. ఉమ్మితో రుద్దే నిబంధనపైనే నేను ఆసక్తిగా ఉన్నా. క్రికెట్ పునః ప్రారంభమైన తర్వాత మేం ఏయే మార్గదర్శకాలు అనుసరించాలో ఇంకా తెలియదు. అయితే ఉమ్మికి మాత్రం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. బంతిపై మెరుపు లేకుంటే.. బౌలర్లకు కష్టం. ఒక్కోసారి మైదానాలు చిన్నవి ఉంటాయి, పిచ్లు ఫ్లాట్గా మారుతాయి. బంతితో సంప్రదాయ స్వింగ్, రివర్స్ స్వింగ్ చేసేందుకు ఏదైనా ప్రత్యామ్నాయం అవసరం' అని అన్నాడు.