
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల విషయంలో బీసీసీఐకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రసార హక్కుల కేటాయింపులో పోటీ మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) బీసీసీఐకి రూ. 52 కోట్ల జరిమానా విధించింది.
జరిమానా ఎందుకు?
ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందంలో భాగంగా బోర్డు ఆర్థిక, బిడ్డర్ల ప్రయోజనాలు కాపాడడానికి అనుకూలంగా నిబంధనల్ని పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో మరే క్రికెట్ లీగ్కూ మద్దతు ఇవ్వబోమని, ఆటగాళ్లను కూడా మరే లీగ్కూ అనుమతించదని బీసీసీఐ అందులో పేర్కొంది.
దీంతో 2013-14, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లోని బోర్డు సగటు వార్షికాదాయం రూ. 1164.7 కోట్లను లెక్కలోకి తీసుకొని ఈ జరిమానాను ఖరారు చేసింది. బోర్డుకు సంబంధించిన మూడు ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని సగటున 4.48 శాతం జరిమానాగా విధించినట్టు సీసీఐ తన 44 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఐపీఎల్ మీడియా రైట్స్ విషయంలో బోర్డు ఏకంగా పదేళ్ల హక్కులను ఒక్క మీడియా (సోనీ) సంస్థకే కేటాయించిన సంగతి తెలిసిందే. ఇది ఏకఛత్రాధిపత్యానికి దారి తీస్తుందని, దీని వల్ల పోటీ తత్వం లేకుండా పోతోందన్న ఉద్దేశంతో కాంపిటీషన్ కమిషన్ బీసీసీఐకి జరిమానా విధించింది.
అంతేకాదు ఒకరికే మీడియా హక్కులను కేటాయించడం వల్ల మిగతా బ్రాడ్కాస్టర్లు పోటీపడే అవకాశాల్ని కోల్పోయారని ఆ ఉత్తర్వులో వెల్లడించింది. 2013లో కూడా భారత బోర్డును కాంపిటీషన్ కమిషన్ ఇదే విషయంలో విచారించింది. అయితే దీనిపై ట్రిబ్యునల్లో సవాల్ చేయడంతో బోర్డు జరిమానా నుంచి బయటపడింది.