కరాచీ: తనను భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ అహ్మద్ షెజాద్ అసహనం వ్యక్తం చేశాడు. తమ మధ్య ఎలాంటి పోలికలు లేవని చెప్పాడు.
విరాట్ కోహ్లీ భారత్ తరఫున ఆడుతున్నాడని, తాను పాకిస్థాన్ తరఫున ఆడుతున్నానని చెప్పాడు. అతని ఆశయాలు అతనికున్నాయి, తన లక్ష్యాలు తనకు ఉన్నాయని స్పష్టం చేశాడు.
తాను ఆడిన మ్యాచ్లకు రెట్టింపు సంఖ్యలో అతను ఆడాడని గుర్తు చేశాడు. మీడియా ఇలా ఆటగాళ్లను పోల్చే ధోరణికి స్వస్తి చెప్పాలని హితవు పలికాడు. తాను ఇప్పటి వరకు 70 మ్యాచులు మాత్రమే ఆడానని చెప్పాడు. పాకిస్తాన్ తరఫున 100వ టెస్ట్ ఆడాలన్నది తన కోరిక అని చెప్పాడు.
తనపై వస్తున్న క్రమశిక్షణారాహిత్యం, ఆటిట్యూడ్ ఆరోపణల పైన కూడా స్పందించాడు. అతను వాటిని కొట్టి పారేశాడు.
స్వేచ్ఛగా, సంతోషంగా క్రికెట్ ఆడడాన్ని తాను ఆస్వాదిస్తానని, అదే తనకు ఇష్టమని చెప్పాడు. మంచి దుస్తులు ధరిస్తానని, మంచిగా తింటానని, తిరుగుతానని చెప్పాడు. అంతమాత్రాన జట్టుకు సహకరించనని అనుకోవడం సరికాదన్నాడు. సహచరుల్ని గౌరవిస్తానన్నాడు. తన పైన అపోహలు మాత్రమే అన్నాడు.