దేశ సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కొన్నేళ్ల నుంచి జరగట్లేదు. ఆసియా కప్ కోసం టీమిండియాను తమ దేశానికి రప్పించడానికి పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఐసీసీని శాసించే స్థాయికి చేరుకున్న భారత్పై మైదానంలో, బయటా పైచేయి సాధించాలనుకుంటున్న పాకిస్థాన్కు ఎప్పటికీ నిరాశే మిగులుతోంది.
ప్రపంచ మెగా లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్థాన్ ప్లేయర్లుకు ఎంట్రీయే లేదు. ఆ రెండు నెలల సమయంలో పాక్ ఆటగాళ్లు, మాజీల బాధ వర్ణనాతీతం. భారత్పై అక్కసు వెళ్లగక్కడంలో వాళ్లంతా బిజీబిజీగా ఉంటుంటారు. ఐసీసీపై ఒత్తిడి చేస్తూ ఏదో ఒక సిరీస్ ఆడాలని ట్రై చేస్తుంటారు.

అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దుస్థితిని తాజాగా ఆ దేశ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్ అంగీకరించడటం గమనార్హం. భారత్లోని ధర్మశాల వంటి సుందరమైన స్టేడియాన్ని పాకిస్థాన్ ఎందుకు నిర్మించలేకపోతుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వసీమ్ అక్రమ్ బదులిచ్చాడు. వాళ్ల క్రికెట్ బోర్డు పరిస్థితిని అక్రమ్ వెల్లడించాడు. ఉన్న స్టేడియాలను మెయింటైన్ చేయడానికే తమకు దిక్కులేదనే నిజాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు.
'భారత్లోని ధర్మశాల, న్యూజిలాండ్లోని క్వీన్స్టౌన్ వంటి అందమైన స్టేడియాలను దేశ ఉత్తరాన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎందుకు నిర్మించాలనుకోవట్లేదు?' అని ఓ అభిమాని వసీమ్ అక్రమ్ను ప్రశ్నించాడు. దానికి వసీమ్ అక్రమ్ ఇలా బదులిచ్చాడు. ''మా వద్ద ఉన్న మూడు స్టేడియాల నిర్వహణే సక్రమంగా చేయలేకపోతున్నాం. మళ్లీ కొత్త స్టేడియాన్ని నిర్మిస్తామనుకుంటున్నారా? మా గడ్డాఫీ స్టేడియం పైకప్పును ఎప్పుడైనా చూశారా? డ్రోన్ సహాయంతో ఎప్పుడైనా ఆ స్టేడియాన్ని చూపించడాన్ని మీరు గమనించారా?''
''ఉన్న మూడు స్టేడియాలనే సరిగా నిర్వహించలేకపోతున్నాం. కొత్త స్టేడియాన్ని నిర్మించాలని కలను మాత్రమే మనం కనగలం. ఇక్కడ నూతన స్టేడియాన్ని సిద్ధం చేయడానికి అనువైన స్థలం కూడా ఉంది. అబ్బాటబాద్ సుందరమైన మైదానం'' అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టును భారత్ ధర్మశాల వేదికగా ఆడిన విషయం తెలిసిందే. హిమాలయాల మధ్య ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోని అందమైన మైదానాల్లో ఒకటి. సముద్ర మట్టానికి 1457 మీటర్ల ఎత్తులో ఈ స్టేడియం ఉండటం విశేషం. ఈ స్టేడియం నిర్వహణను హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ గొప్పగా నిర్వర్తిస్తుంది.