
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా వుమెన్స్ టీం సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెలరేగి ఆడింది. బుధవారం బార్బడోస్ వుమెన్స్ టీంతో తలపడ్డ భారత్ 100పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్ చేరుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు షఫాలీ వర్మ (26 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 43పరుగుుల), దీప్తి శర్మ (28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఇక గ్రూప్ బీలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచే జట్టుతో టీమిండియా వుమెన్స్ టీం సెమీస్లో తలపడుతుంది. సెమీస్లో గెలిస్తే మన టీంకు మెడల్ ఖాయమవుతుంది.
ఇక ఛేదనకు దిగిన బార్బడోస్ వుమెన్స్ టీం బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి కేవలం 62పరుగులకు మాత్రమే ఆ టీం పరిమితమైంది. ఆ జట్టులో కోషోనా నైట్ 16పరుగులతో టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. భారత బౌలర్ రేణుకా సింగ్ 4వికెట్లతో రఫ్పాడించగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తీసి సత్తా చాటారు.
తుది జట్లు :
ఇండియా : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్
బార్బడోస్ : డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కైసియా నైట్ (వికెట్ కీపర్), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, షాంట్ కారింగ్టన్, షానికా బ్రూస్