పతకధారులతో..
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించారు వెయిట్ లిఫ్టర్ సాయిఖొమ్ మీరాబాయి చాను. శనివారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 201 కేజీల బరువును ఎత్తారు. అంతకుముందు ఇదే కేటగిరీలో భారత్కు రెండు పతకాలు అందాయి. వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ వెండి పతకాన్ని ముద్దాడాడు. పురుషుల 61 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ పుజారి రజతాన్ని గెలిచాడు.
క్రికెట్లో ముందడుగు..
ఇవ్వాళ కూడా మరిన్ని ఈవెంట్లల్లో పతకాల పంట పడే అవకాశం లేకపోలేదు. అదే క్రమంలో క్రికెట్లో భారత మహిళా జట్టు కీలక టీ20 మ్యాచ్ ఆడబోతోంది. పాకిస్తాన్ మహిళా జట్టును ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో అనూహ్యంగా పరాజయం పాలైంది మహిళా జట్టు.
రికార్డ్స్ ఇవే..
దానికి ప్రతీకారాన్ని పాకిస్తాన్పై తీర్చుకోవడానికి సన్నద్ధమైంది. పాకిస్తాన్ మహిళా జట్టుపై ఇప్పటివరకు ఉన్న భారత్కు ఉన్న హయ్యెస్ట్ టోటల్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు. 2018లో ఈ స్కోర్ సాధించింది. లోయెస్ట్ స్కోర్ 63. 2012లో జరిగిన టీ20 మ్యాచ్లో 63 పరుగులకే భారత మహిళా జట్టు పాకిస్తాన్ చేతిలో ఆలౌట్ అయింది. అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డ్ మిథాలి రాజ్ పేరు మీద ఉంది. ఆమె 73 పరుగులు చేశారు. ఈ స్కోర్ను ఇప్పటివరకు మరే టీమిండియా మహిళా ప్లేయర్ అందుకోలేదు.
ఆసీస్ చేతిలో ప్రతీకారానికి..
బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. ప్రియాంక రే పేరు మీద ఉంది. 16 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను నేలకూల్చింది. ఇవ్వాళ్టి మ్యాచ్లో ఆయా రికార్డులన్నీ చెరిగిపోయే అవకాశాలు లేకపోలేదు. భారత్ తన అత్యధిక పరుగుల రికార్డును సవరించుకోవడానికి సమాయాత్తమౌతోంది. కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది విమెన్ టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. ఇంకో ఓవర్ మిగిలివుండగానే మహిళ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించింది.
తుదిజట్టు అంచనాలివే..
ఈ మ్యాచ్ను సోనీ లివ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్మృతి మంధాన, షఫాలి వర్మ, యాస్టికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్ ప్రీత్ కౌర్ (కేప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ తుది జట్టులో చోటు దక్కించకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ టీమ్లో- మునీబా అలీ (వికెట్ కీపర్), ఈరమ్ జావెద్, బిస్మా మహరూఫ్ (కేప్టెన్), ఉస్మానియా సొహైల్, ఆలియా రియాజ్, నీదా దర్, ఆయేషా నసీమ్, తౌబా హస్సన్, అనమ్ అమీన్, ఫాతిమా సన, డయానా బేగ్ ఆడొచ్చు.