
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటివరకు భారత్ తన ఖాతాలో 49పతకాలు చేరాయి. అందులో బంగారం-17, రజతం-13, కాంస్యం-19 పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంకా కొన్ని కీలక ఈవెంట్లు ముందున్నాయి. అందులో కీలకమైంది.. అత్యంత ఆదరణ కలిగినది అయిన క్రికెట్ ఒకటి. ఇందులో ఇప్పటికే కనీసం సిల్వర్ మెడల్ ఖాయమైంది. అయితే గోల్డ్ మెడల్ కోసం భారత జట్టు సన్నద్ధమైంది. ఇవ్వాళ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళ జట్టు ఫైనల్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతోంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్నిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లను ఆడిన భారత మహిళా జట్టు మూడింట్లో నెగ్గింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో త్రుటిలో హర్మన్ సేన ఓటమిపాలయింది. ఇక లెక్కకు లెక్క సరిచేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించి ఇండియాకు అపురూప కానుక ఇవ్వాలని చూస్తోంది.
ఇక ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ.. మేము తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మంచి వికెట్ కనిపిస్తుంది. సానుకూలంగా వాతావరణం ఉంది. ఫైనల్ చేరడం పట్ల ఉత్సాహంగా ఉంది. ఈ రోజు మేం మంచి ప్రదర్శన చేయగలమని భావిస్తున్నాం. అని పేర్కొంది. ఇక టాస్ పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇక టాస్ ఓడిన హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. టాస్ మా నియంత్రణలో లేదు. మేము రెండింటికీ సిద్ధంగా ఉన్నాం. మేం సేమ్ టీమ్తో బరిలోకి దిగుతున్నాం. మా నుంచి 100శాతం ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం. మేము ఈ రోజు ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం అని పేర్కొంది.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్, రాచెల్ హేన్స్, ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
ఫైనల్ ఆడుతున్న మన గోల్డెన్ లేడీస్ టీంకు ఆల్ ది బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక స్టార్ క్రికెటర్, భారత మెన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వీడియోలో భారత మహిళల టీం సత్తువను కొనియాడాడు. గొప్పగా ఆడి మీ ప్రయత్నాన్ని చివరి వరకు కొనసాగించండంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే ఐపీఎల్ టీంలు కూడా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా కమ్ ఆన్.. అంటూ ఇండియా టీంను చీర్స్ చేశాయి. ఇక ఎంతో మంది అభిమానులు పలు పోస్టులతో తమ విషెస్ చెప్పాయి.