|
మీకెంత ధైర్యం ప్రధాని గారు
అయితే భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్పై ఆ దేశ మాజీ క్రికెటర్, ఐపీఎల్ 2021 కామెంటేటర్ మైకేల్ స్లేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆస్ట్రేలియన్ల భద్రత గురించి ప్రభుత్వం నిజంగా ఆలోచిస్తే.. మమ్మల్ని ఇంటికి రావడానికి అనుమతిస్తారు. ఇది చాలా అవమానకరం. మీ చేతులకు రక్తం అంటింది ప్రధాని గారు. మాతో ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీ క్వారంటైన్ వ్యవస్థను ఎందుకు మెరుగుపరచుకోవడం లేదు. ఐపీఎల్లో పని చేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడదే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది' అని ట్వీట్ చేశారు.
|
మాల్దీవులకు స్లేటర్
ఆస్ట్రేలియాలో కాకుండా భారత దేశంలో ప్రతిరోజూ వేలాది మంది చనిపోతున్నారని, ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలని మైకేల్ స్లేటర్ మరో ట్వీటులో పేర్కొన్నారు. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలలో కరోనా కేసులు నమోదయిన నేపథ్యంలో స్లేటర్ బుడగను విడిచి పెడతారని సమాచారం తెలుస్తోంది. ఈ వారాంతం లోగా మాల్దీవులకు వెళ్ళిపోతాడని సమాచారం తెలుస్తోంది. అక్కడి నుంచి ఆసీస్ చేరుకుంటాడట. స్లేటర్ ఆసీస్ తరఫున 76 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5312, వన్డేల్లో 987 రన్స్ చేశాడు.
స్వదేశానికి ముగ్గురు ఆసీస్ ప్లేయర్స్
ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 15 వరకూ ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధిండంతో ఐపీఎల్ 2021లో ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా స్వదేశానికి చేరుకున్నారు. మిగతా ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇందుకు ఓ పరిష్కారం చూపించాడు. ఐపీఎల్ టోర్నీ ముగియగానే భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి తాము కూడా యూకే వెళ్లిపోతామని.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళతామని తన మాస్టర్ ప్లాన్ గురించి తెలిపాడు. జూన్ 18 నుంచి అక్కడ ఇండియా, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ జరగనున్న విషయం తెలిసిందే.
సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలి
ఆసీస్ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయాలని ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను వేడుకున్నాడు. 'ఐపీఎల్ ఒప్పందంలో భాగంగా సీఏ 10శాతం మొత్తాన్ని చార్టర్డ్ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలి. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్లో ఉన్నాం. వ్యాక్సిన్ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం' అని లిన్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాని స్కాట్ మోరిసన్ తేల్చి చెప్పారు.