హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సాధారణంగా మైదానంలో ఆటగాళ్లు తత్తరపాటుకు గురికావడాన్ని మనం చూశాం. అయితే రాంచీ టెస్టులో న్యూజిలాండ్కు చెందిన అంపైర్ క్రిస్ గఫానే తత్తరపాటుకు గురై మైదానంలో నవ్వులు పూయించాడు.

నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా పుజారా బ్యాటింగ్ చేస్తుండగా 140వ ఓవర్ను ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ వేశాడు. హేజిల్వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుజారా హుక్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ తాకకుండా కీపర్ చేతిలోకి వెళ్లింది.

ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయలేదు కానీ.. తొందరపడిన అంపైర్ గఫానే మాత్రం వేలు పైకెత్తాడు. స్లిప్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఏమైందని సైగలు చేయడంతో తలపై టోపీని సరిచేసుకుంటున్నట్లు తన వేలిని టోపీపైకి పోనిచ్చి తల గోకుతున్నట్టు కవర్ చేశాడు.
ఈ సంఘటనను చూసిన వ్యాఖ్యాతలు నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లతో పాటు మరో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్.. క్రిస్ అద్భుత నటనను చూసి నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది.