
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ ఛాంపియన్ ఎవరో తెలిసిపోతుంది. రెండో సెమీస్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్ ఫైనల్లో 27 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమ జట్టు ఫైనల్కు చేరడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఫైనల్కు చేరిన ఇంగ్లాండ్ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వినూత్నంగా ఓ వీడియోని రూపొందించి అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు ప్రపంచకప్లో ఇంగ్లాండ్కు ప్రాతినిథ్యం వహించిన 101 మంది మాజీ ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వీడియాలో ఇయాన్ బోథమ్, గ్రాహమ్ గూచ్, ఆండ్రూ స్ట్రాస్, నాసిర్ హుస్సెన్ వంటి ఇంగ్లండ్ దిగ్గజాలు 'కమాన్ ఇంగ్లండ్' అంటూ ఇంగ్లీషు ఆటగాళ్లను ప్రోత్సహించారు. "101 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు మీకంటే ముందు ప్రపంచకప్ గెలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు చరిత్రను సృష్టించే అవకాశం మీకు వచ్చింది. దేశం కోసం ప్రపంచకప్ గెలిచి గర్వించేలా చేయండి" అని ఇయాన్ బోథమ్ పేర్కొన్నాడు.
"కేవలం ఒక్క ఇంగ్లాండ్ జట్టు మాత్రమే మూడు సార్లూ ఫైనల్కు చేరి ప్రపంచకప్ గెలవకుండా ఉంది. ఓడిపోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే ఇప్పటివరకు ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. ఫైనల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పోరాడండి. ఆదివారం మ్యాచ్కు ఆల్ ద బెస్ట్" గ్రాహమ్ గూచ్ అన్నాడు.