|
ఇక్కడి శవాలను చూడండి:
ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మైకేల్ స్లేటర్ మండిపడుతూ ట్విటర్లో వరుస ట్వీట్లు చేశాడు. 'మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది ఎంతో నిజం. మీరు మీ ప్రైవేట్ జెట్లో వచ్చి.. ఇక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ స్లేటర్ విరుచుకుపడ్డాడు. స్లేటర్ ఆసీస్ తరఫున 76 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5312, వన్డేల్లో 987 రన్స్ చేశాడు.
|
ప్రతి భారతీయుడి కోసం నేను ప్రార్థిస్తాను:
మరోవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతీయులకు మైకేల్ స్లేటర్ సంఘీభావం తెలిపాడు. 'కరోనా మహమ్మారిపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. ప్రతి భారతీయుడి కోసం నేను ప్రార్థిస్తాను. ఐపీఎల్లో కామెంటేటర్గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని స్లేటర్ మరో ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో కామెంటేటర్గా ఉన్న స్లేటర్.. తిరిగి ఇంటికి వెళ్లే విషయంలో తమ ప్రధానిపై విమర్శలు చేస్తున్నాడు. తమతో ఇంత దారుణంగా వ్యవహరించడంపై గుర్రుగా ఉన్నాడు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది:
భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్పై ఐపీఎల్ 2021 కామెంటేటర్ మైకేల్ స్లేటర్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఆస్ట్రేలియన్ల భద్రత గురించి ప్రభుత్వం నిజంగా ఆలోచిస్తే.. మమ్మల్ని ఇంటికి రావడానికి అనుమతిస్తారు. ఇది చాలా అవమానకరం. మీ చేతులకు రక్తం అంటింది ప్రధాని గారు. మాతో ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీ క్వారంటైన్ వ్యవస్థను ఎందుకు మెరుగుపరచుకోవడం లేదు. ఐపీఎల్లో పని చేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడదే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది' అని ట్వీట్ చేశాడు.
మాల్దీవ్స్ మీదుగా :
ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కొంతమంది ఇంగ్లండ్ క్రికెటర్లు ఇప్పటికే లండన్ బయలుదేరి వెళ్లారు. కరోనా విజృంభణ కారణంగా మే 15 వరకు భారత్ నుంచి ప్రయాణికులు ఎవరూ ఆస్ట్రేలియాకు రాకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవ్స్ మీదుగా తమ దేశానికి వెళ్లాలనుకుంటున్నారు. త్వరలో చార్టర్డ్ విమానంలో మాల్దీవ్స్కు వెళ్లి, ఆస్ట్రేలియా సరిహద్దులను తెరిచే వరకు ఆక్కడే వేచి ఉండాలని క్రికెటర్లు నిర్ణయించుకున్నారని ఓ అధికారి బుధవారం తెలిపారు.