టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్న అనంతరం జట్టులో ఊహించని మార్పులు మొదలయ్యాయి. భారత జట్టు భవిష్యత్ కెప్టెన్గా భావించిన హార్దిక్ పాండ్యకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు బాధ్యతలు అందుకున్నాడు. టీ20, వన్డేల్లో వైస్కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇక పొట్టి ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ చోటు కోల్పోయాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లతో కలిసి గంభీర్ జట్టును సిద్ధం చేస్తున్నాయి. అయితే వాటితో పాటు గంభీర్ ఈ ఏడాది ఆఖర్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్లో బుమ్రాకు దీటుగా మరో అస్త్రాన్ని గంభీర్ సిద్ధం చేయనున్నాడు.

దీంతో వైట్ బాల్ క్రికెట్కు పరిమితమైన అర్షదీప్ సింగ్ను టెస్టు జట్టులోకి గంభీర్ తీసుకురావాలని భావిస్తున్నాడు. గంభీర్ అభిప్రాయంతో టీమిండియా సెలక్టర్లు కూడా ఏకీభవించారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయాల్లో అర్షదీప్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఎనిమిది మ్యాచ్ల్లో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. అయితే టెస్టులకు సన్నద్ధంగా అర్షదీప్ను దులీప్ ట్రోఫీ ఆడమని బీసీసీఐ ఆదేశించింది.
''భారత్ తరఫున వైట్ బాల్ ఫార్మాట్లో అర్షదీప్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని దేశవాళీ రెడ్ బాల్ మ్యాచ్లు ఆడమని ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో అతను ఆకట్టుకుంటే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడు. ఆస్ట్రేలియాలో బుమ్రా తరహాలో అతను కూడా గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్పై సెలక్టర్లు దృష్టిసాధించారు. అందుకే శ్రీలంక పర్యటనలో ఖలీల్ను టీ20, వన్డే జట్టులో ఎంపిక చేశారు'' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.