IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియాకు ఊహించని ఓటమి ఎదురైంది. పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్(డీఎల్ఎస్) పద్ధతి ప్రకారం 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ముందు 26 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యం ఉండగా.. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ అండతో 22వ ఓవర్లోనే గెలుపును అందుకుంది.
కొంపముంచిన కెప్టెన్, కోచ్ తప్పుడు నిర్ణయం
టీమిండియా ఈ మ్యాచ్లో అనేక తప్పులు చేసినప్పటికీ అత్యంత కీలకమైనది బ్యాటింగ్ ఆర్డర్లో వ్యూహాత్మక తప్పిదం. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో అక్షర్ పటేల్ వికెట్ పడిన తర్వాత ఆ సమయంలో జట్టుకు అత్యవసరంగా వేగంగా పరుగుల కోసం పవర్ హిట్టింగ్ అవసరం. ఈ దశలో పవర్హిట్టర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ కోసం వాషింగ్టన్ సుందర్ను పంపాలని నిర్ణయించారు.

వాషింగ్టన్ సుందర్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్ అయినప్పటికీ.. ఆ ఒత్తిడి సమయంలో ధాటిగా ఆడే పవర్హిట్టర్ కాడు. ఈ నిర్ణయం వల్ల వాషింగ్టన్ సుందర్ 10 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవసరమైన వేగాన్ని అందించడంలో విఫలమయ్యాడు. కీలకమైన చివరి ఓవర్లలో ఇలా నెమ్మదిగా ఆడడం భారత స్కోరు వేగాన్ని పూర్తిగా తగ్గించింది.
నితీష్ కుమార్ రెడ్డి ప్రభావాన్ని కోల్పోవడం
నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో 24వ ఓవర్ నడుస్తోంది. అప్పటికే చాలా బంతులు వృథా అయ్యాయి. మరోవైపు తోక బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోవడం.. సింగిల్స్ తీయడంలో కూడా ఇబ్బందులు ఎదురవడంతో నితీష్ తన సహజమైన ఆటను ఆడలేకపోయాడు. అయినప్పటికీ చివర్లో పోరాడి చివరి ఓవర్లో 2 అద్భుతమైన సిక్సర్లు బాది 11 బంతుల్లో 19 పరుగులు సాధించాడు. నితీష్ చివర్లో అద్భుతంగా ఆడడం వల్లే భారత్ స్కోరు 136కు చేరుకోగలిగింది. ఒకవేళ అతడిని ముందుగానే పంపి ఉంటే టీమిండియా సులువుగా 150-160 పరుగుల మార్కును దాటి, ఆస్ట్రేలియాకు మరింత కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి తోడైన బౌలింగ్ వైఫల్యం
బ్యాటింగ్ ఆర్డర్ లోపం ఒకవైపు ఉండగా.. టీమిండియా బౌలింగ్ విభాగం కూడా ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినప్పటికీ, మిచెల్ మార్ష్ (52 బంతుల్లో నాటౌట్ 46), జోష్ ఫిలిప్ (29 బంతుల్లో 37) ధాటికి రన్ రేట్ తగ్గలేదు. మిచెల్ మార్ష్ తన నిలకడైన ఆటతీరుతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. టీమిండియా ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా, వారిలో నలుగురు బౌలర్లు 6కు పైగా ఎకానమీ రేట్తో పరుగులను సమర్పించుకున్నారు. ఈ సంయుక్త వైఫల్యాలే పెర్త్ మ్యాచ్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.