
హైదరాబాద్: బీసీసీఐ ఆరు నెలల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్కు రూ. 16 వేల కోట్లకు పైగా అమ్ముకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వేలానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందుకోసం వచ్చే నెల 27న వేలం ప్రక్రియను నిర్వహించనుంది.
అయితే ఈసారి నిర్వహించే వేలం ప్రక్రియను 'ఈ-వేలం' ద్వారా నిర్వహించడం విశేషం. బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయం మేరకు 'ఈ-వేలం' ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ వేలంలో ఈ సారి దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్లను కలిపి వేలాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం 'స్టార్' నెట్వర్క్తో ఉన్న ఒప్పందం గడువు మార్చి 31తో ముగియనుంది.
2012లో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాచ్ల ప్రసార హక్కులను అప్పట్లో రూ. 3851 కోట్ల మొత్తానికి 'స్టార్ నెట్ వర్క్' చేజిక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల కాలానికి గాను అంటే ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు ప్రసార హక్కులు వేలానికి వచ్చాయి.
ఈ ప్రసార హక్కులను మొత్తం మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో ఒకటి గ్లోబల్ టెలివిజన్ రైట్స్ ప్యాకేజీ కాగా, రెండోది ఇండియా-సబ్కాంటినెంట్ డిజిటల్ రైట్స్ ప్యాకేజీ, మూడోది గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్ ప్యాకేజీ. అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది.
దీంతో ఒక్కో మ్యాచ్కు 60 కోట్లపైమాటే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తిగల ప్రసార సంస్థలు మార్చి 5వ తేదీలోపు రూ 6.5 లక్షలు చెల్లించి టెండరు దరఖాస్తును పొందాలి. మార్చి 27వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. అదేరోజు ఈ-వేలం ద్వారా ప్రసార హక్కులు కట్టబెడతారు.
ఈ టెండర్ ప్రక్రియపై బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ లేకుండానే వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐకి, సుప్రీంకోర్టు నియమించిన పాలక కమిటీ (సీఓఏ)కి మధ్య విబేధాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. తమకు మాట మాత్రమైన చెప్పకుండానే సీఓఏ తీసుకుంటున్న నిర్ణయంపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.