
హైదరాబాద్: బీసీసీఐ రాజ్యాంగానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు గాను సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సెప్టెంబర్ 11న ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇంగ్లాండ్తో వన్డే, టెస్టు సిరీసుల్లో కోహ్లీసేన ఆటతీరుపై సీవోఏ సమీక్షించే అవకాశాలున్నాయి.
"ముంబైలో సెప్టెంబర్ 11న సీఓఏ సమావేశం ఉంది. ఇందులో కొత్త రాజ్యంగం అమలు, ఇంగ్లాండ్ సిరీస్లో కోహ్లీసేన ప్రదర్శన వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రవిశాస్త్రితో ముఖాముఖి మాట్లాడతారా? రాత పూర్వక నివేదిక తీసుకుంటారా? అన్నది కమిటీ ఇష్టం" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"ప్రస్తుతం క్రికెట్ సలహా సంఘం పనిచేయడం లేదు. బీసీసీఐకి తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు సీఓఏదే బాధ్యత. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ప్రదర్శనపై సమీక్ష కీలకం కానుంది" అని ఆయన తెలిపారు. మరోవైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయాన్నీ సీఓఏ కోరనుంది.
"ప్రస్తుతం మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం పరిపాలన, కార్యకాలాపాల గురించే నివేదిక ఇస్తారు. జట్టు ప్రదర్శన గురించి ఇవ్వకపోవచ్చు. అందులో పూర్తిగా రవాణా ఖర్చులు, ఆహారం ఎంపిక, వసతి, సాధన చేసేందుకు ఉన్న పరిస్థితులపై ఉండొచ్చు. అంటే క్రికెట్ సంబంధించిన వివరాలు రవిశాస్త్రి, కోహ్లీ లేదా ఎమ్మెస్కే ఇవ్వొచ్చు" అని ఆయన అన్నారు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. జట్టులోని ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాల గురించి ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్ నుంచి సీఓఏ నివేదిక కోరే అవకాశముందని తెలుస్తోంది.
"వెన్ను నొప్పితో ఉన్న భువీని బలవంతంగా మూడో వన్డేలో ఆడించారా? సౌతాంప్టన్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడా? ఈ రెండు కేసుల్లో గాయం తీవ్రత గురించి అధికారులకు చెప్పారా? వంటి ప్రశ్నలపై నివేదిక కోరే అవకాశం ఉంది" అని బీసీసీఐ అధికారి తెలిపారు.