బీసీసీఐ కొత్తగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవి ప్రధాన రేసులో భారత మాజీ కెప్టెన్, జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందు వరసలో ఉన్నాడు. అయితే పారదర్శక నియామక ప్రక్రియలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని బీసీసీఐ తెలిపింది. దీంతో ద్రవిడ్ ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గతంలో నేరుగా చేపట్టిన నియామకాలతో బోర్డుపై పలు విమర్శలు వచ్చాయి. విమర్శల నేపథ్యంలో.. ఇకపై ఏ నియామకమైనా పారదర్శకంగా చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎన్సీఏ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. రవితో పాటే ఇతర సిబ్బంది పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత అందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
'బీసీసీఐలోని అన్ని పదవుల నియామకానికి చేపట్టినట్లే.. ఎన్సీఏ హెడ్ కోచ్ పదవి కోసం కూడా దరఖాస్తుల్ని ఆహ్వానిస్తాం. ఈ పదవి రేసులో ప్రధానంగా ద్రవిడే ముందు వరుసలో ఉన్నాడు. ద్రవిడ్ జూనియర్ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దాడు' అని బీసీసీఐ బోర్డు అధికారి వెల్లడించారు.