
హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమయ్యే అవకాశం ఉందని సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఛైర్మన్ వినోద్రాయ్ సూచనప్రాయంగా చెప్పారు. ఐపీఎల్కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలిసిందే.
ఆస్ట్రేలియాలో మహిళల బిగ్బాష్ లాగే భారత్లో కూడా మహిళా క్రికెటర్ల కోసం ఓ ఐపీఎల్నూ నిర్వహించాలని మహిళా క్రికెటర్లు ఎప్పటి నుంచో కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై న్యూడిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్పందించారు.
'ఎడుల్జీ (సీఓఏ సభ్యురాలు), మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో కలిసి మేం చాలా ఈవెంట్లకు రూపకల్పన చేశాం. మహిళల ఐపీఎల్నూ చూసే అవకాశముంది' అని ఆయన వ్యాఖ్యానించారు. గత మూడు నెలలుగా నిర్వహిస్తున్న మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేశామని అన్నారు.
పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు ఇచ్చే రివార్డులు తక్కువేనని ఆయన అన్నారు. పురుష, మహిళా క్రికెటర్లకు సమాన స్థాయిలో మ్యాచ్ ఫీజు అందించలేమన్న ఆయన పురుషుల క్రికెట్ రెవెన్యూ ఆదాయం ఎక్కువా? అని భవిష్యత్తులో మహిళా క్రికెటర్లు కూడా ఆస్థానం అందుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి భారత మహిళా క్రికెట్లో మార్పు మొదలవుతాయని ఆయన తెలిపారు. వరల్డ్ కప్ ఫైనల్ చేరి అందరి మన్ననలు పొందిన మిథాలీసేన, అనంతరం మ్యాచ్ షెడ్యూల్స్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ మ్యాచ్లున్నా అవి ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో మహిళా క్రికెట్ ఆదరణకు నోచుకోని సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.