హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని గురువారం బీసీసీఐని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆదేశించింది. 'ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని ప్రకటించేందుకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉండగా ఇప్పటి వరకు ఎందుకు జట్టును ఎంపిక చేయలేదు' అని సీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిని సీఓఏ ప్రశ్నించింది.
అంతేకాదు వెంటనే సెలక్షన్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని అమితాబ్ చౌదరిని కమిటీ కోరింది. ఛాంపియన్స్ టోర్నీ నుంచి భారత జట్టు తప్పుకునే అవకాశం లేదని సీవోఏ స్పష్టంగా పేర్కొంది. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి లండన్లో ఐసీసీ ఛాంపియన్స్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలూ తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 25) లోపే జట్లను ప్రకటించాలి. కొద్ది రోజుల క్రితం దుబాయ్లో జరిగిన ఐసీసీ మీటింగ్లో కొత్త రెవెన్యూ మోడల్ విషయంలో 2-8 ఓటింగ్తో బీసీసీఐకి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐసీసీకి లీగల్ నోటుసులు పంపే ఆలోచన కూడా బీసీసీఐ చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకునే అంశంపై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలా వద్దా అనే విషయమై మే ఏడో తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ భారత క్రికెట్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటికే బీసీసీఐని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాసింది.
'భారత క్రికెట్ ప్రయోజనాలకు అనుకూలమైన ఏ నిర్ణయానికైనా మద్దతిస్తాం. విరుద్ధంగా ఉంటే మాత్రం ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. మా అభిప్రాయం కూడా చెప్పి, కోర్టు జోక్యాన్ని కోరతాం' అని చెప్పింది.
'2014 నాటి ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ, ఇతర క్రికెట్ బోర్డులు ఒప్పుకునే అవకాశం లేదు. ఐతే ఇటీవల సవరించిన ఆర్థిక నమూనా ప్రకారం భారత్ వాటాకు వచ్చే డబ్బు కంటే ఎక్కువ ఇచ్చేందుకు తప్పకుండా ఒప్పుకుంటాయి' అని లేఖలో వివరించింది.