
లక్నో: టీమిండియా బ్యాట్స్మన్ సురేష్ రైనా శనివారం అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. రైనా రిటైర్మెంట్ వార్త తెలియగానే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో అతని సేవలను కొనియాడారు. భారత జట్టుకు ఎనలేని విజయాలు అందించడమే కాకుండా.. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని మెచ్చుకున్నారు. రైనా రిటైర్మెంట్ ప్రకటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
'సురేష్ రైనా గొప్ప ఆటగాడు. మంచి బ్యాట్స్మన్, అంతకుమించి అద్భుత ఫీల్డర్. ఆల్రౌండర్గా తన ప్రతిభ చాటుకున్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతని సేవలు ఎప్పటికీ మర్చిపోలేం. రైనా యూపీ రత్నం' అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్వీడ్కోలుపై కూడా స్పందిస్తూ... 'ఎంఎస్ ధోనీ అత్యంత ప్రతిభావంతుడు. అతని రిటైర్మెంట్తో ఓ శకం ముగిసింది. ధోనీ దేశానికి ఎంతో గౌరవం తెచ్చాడు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. కొత్త ఇన్సింగ్స్ ప్రారంభించిన ధోనీకి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.
శనివారం ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికినట్లు వెల్లడించిన కొద్దిసేపటికే తాను కూడా తప్పుకుంటున్నట్లు 33 ఏళ్ల రైనా ప్రకటించాడు. 'నీతో (ధోనీతో) కలిసి ఆడడాన్ని ఎంతో ప్రేమించా. సంతృప్తి నిండిన హృదయంతో ఈ ప్రయాణంలో నీతో కలవాలని నిర్ణయించుకున్నా. భారత్కు ధన్యవాదాలు. జై హింద్' అంటూ ధోనీ సహా చెన్నై సూపర్కింగ్స్ జట్టుతో ఉన్న ఫోటోను రైనా ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
2005లో వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన సురేష్ రైనా.. మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 116 పరుగులు. వన్డే ఫార్మాట్లో ఐదు సెంచరీలు, 36 అర్ధ శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టిన రైనా.. 18 టెస్టుల్లో 768 రన్స్ బాదాడు . ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్రేట్తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో సురేష్ రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. ఇక లాక్డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో రైనా పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఈ సీనియర్ క్రికెటర్ ఆశించాడు. కానీ ఇంతలోనే అతడు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇన్ని సీజన్లలో ఒక్కసారి కూడా రైనా నిరాశపర్చలేదు.