తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీ20 వరల్డ్ కప్ విజేత మహ్మద్ సిరాజ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ తనవంతు కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ స్టేజ్లో మాత్రమే తుదిజట్టులో చోటు దక్కినప్పటికీ, బంతితో పాటు బ్యాటుతో అలరించాడు.
పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో ప్రధాన బ్యాటర్లు తడబడిన వేళ సిరాజ్ అజేయంగా ఏడు పరుగులు సాధించాడు. ఇవి విజయం ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ టోర్నీలో ఫీల్డింగ్లోనూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కాగా, ఇటీవల స్వదేశానికి వచ్చిన సిరాజ్ టీమిండియాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ముంబై విక్టరీ పరేడ్లో పాల్గొన్నాడు.

అనంతరం హైదరాబాద్కు వచ్చిన లోకల్ బాయ్కు ఘన స్వాగతం లభించింది. మెహదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు జరిగిన రోడ్ షోలో అభిమానులు నీరాజనం పలికారు. కాగా, ప్రయాణ అలసటతో కొన్ని రోజులు ఇంటికి పరిమితమైన సిరాజ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు. టీమిండియా జెర్సీని సీఎంకు బహుకరించాడు. కాగా, ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ సిరాజ్ను రేవంత్ అభినందించారు. అంతేగాక బహుమతి ప్రకటించారు.
సిరాజ్కు ప్రభుత్వం ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పాల్గొన్నారు.