
హైదరాబాద్: ఇటీవలే వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు అత్యధిక పరుగుల(481) రికార్డుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ రికార్డుని మరిచిపోకముందే క్లబ్ క్రికెట్లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్లో అనూహ్యం చోటు చేసుకుంది. నిజంగా ఈ మ్యాచ్ స్కోరు కార్డుని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో హైవైకాంబ్ జట్టు ఒకానొక దశలో 187/3తో పటిష్టంగా నిలిచింది. మూడు పరుగులు చేస్తే హైవైకాంబ్ జట్టు విజయం సాధిస్తుంది. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. 12 బంతులు మగిలున్నాయి. దీంతో అందరూ హైవైకాంబ్ జట్టుదే విజయం అనుకున్నారంతా!
అయితే, ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా హైవైకాంబ్ జట్టు ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్లో ఈసీబీ నేషనల్ క్లబ్ ఛాంపియన్షిప్ పేరిట వన్డే టోర్నీ జరిగింది. టోర్నీలో భాగంగా సోమవారం పీటర్బారో - హైవైకాంబ్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పీటర్బారో జట్టు నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైవైకాంబ్ జట్టు దూకుడుగా ఆడింది. ఓపెనర్ కల్లిస్ (61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన హ్యాక్స్(59 నాటౌట్)గా రాణించడంతో 38 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
మూడు పరుగులు చేస్తే విజయం సాధిస్తుందని అనుకున్నారంతా. అయితే, ఎవరూ ఊహించని విధంగా పీటర్బారో జట్టు విజయం సాధించింది. 39వ ఓవర్లో హైవైకాంబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్ అయిన 40వ ఓవర్లో మిగిలిన నాలుగు వికెట్లనూ కోల్పోయింది. మొత్తం 11 బంతుల్లో ఆ జట్టు కేవలం ఒకే ఒక్క పరుగు చేసి 7 వికెట్లు కోల్పోయింది.
ఊహించని విధంగా హైవైకాంబ్ జట్టుపై పీటర్బారో జట్టు గెలవడంతో జట్టులోని ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పీటర్బారో జట్టు ఆటగాళ్లలో కైరాన్ జోన్స్ నాలుగు వికెట్లు తీయగా... డాన్యాల్ మాలిక్ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.