హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్కప్ సాధారణ వరల్డ్కప్ కాదని 'ఆల్ రౌండర్స్ వరల్డ్కప్' అని వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ వరల్డ్కప్లో ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషించబోనున్నట్లు లాయిడ్ తెలిపాడు. క్లైవ్ లాయిడ్ ఈ వరల్డ్కప్ను 'ఆల్రౌండర్ల వరల్డ్కప్'గా అభివర్ణించినట్టు ఐసీసీ పేర్కొంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
"ప్రపంచంలో వివిధ టోర్నీల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ఆచితూచి ఎంపిక చేసింది. గత 20 ఏళ్లుగా మేం ఎంతో మంది క్రికెటర్లను కోల్పోయాం. ప్రస్తుతం వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మంచి క్రికెట్ ఆడాలనే తపనతో ఉన్నారు. సొంతగడ్డపై వరల్డ్కప్ జరుగుతుండటంతో ఇంగ్లాండ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది" అని లాయిడ్ అన్నాడు.
"ఈ మధ్య కాలంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అందులో ఎలాంటి సందేహాం లేదు. మంచి ఆటగాళ్లతో పాటు జట్టు సమతూకంగా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండే విజేతగా నిలిచే అవకాశం ఉంది" అని క్లైవ్ లాయిడ్ పేర్కొన్నాడు. వరల్డ్కప్ ఆరంభానికి ముందు వెస్టిండిస్ జట్టు మే26న దక్షిణాఫ్రికా, మే28న న్యూజిలాండ్తో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.
కాగా, క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు 1975, 1979లలో మొదటి రెండు వరల్డ్కప్లను నెగ్గింది. ఈ వరల్డ్కప్లో పాల్గొనే విండీస్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఏడాదిగా ఆడని ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్కు విండీస్ సెలక్టర్లు తిరిగి ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారు.
ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రస్సెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన రస్సెల్ 56.66 యావరేజితో 204.81 స్ట్రైక్ రేట్తో ఏకంగా 510 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్ట్రైక్ రేట్. బౌలింగ్లో 11 వికెట్లు పడగొట్టాడు.