హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ అండర్-23 క్రికెటర్ల టోర్నమెంట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్న 20 ఏళ్ల అర్మాన్ జాఫర్ సౌరాష్ట్ర జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
గంభీర్ లేని ఢిల్లీ ఎప్పటికీ ఐపీఎల్ టైటిల్ నెగ్గదు: ట్విట్టర్లో ఫ్యాన్స్
ఈ మ్యాచ్లో అర్మాన్ జాఫర్ తన మొత్తం 367 బంతుల్లో 26ఫోర్లు, 10 సిక్సర్లు సాయంతో 300 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. వాంఖడే స్టేడియంలో జాఫర్ పరుగుల సునామీతో 139.4 ఓవర్లు ఆడిన ముంబై 610/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌరాష్ట్ర జట్టు 175 పరుగులకే ఆలౌటైంది. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 12/2తో కష్టాల్లో పడిన ముంబైని నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అర్మాన్ జాఫర్ తన భారీ ఇన్నింగ్స్తో జట్టుని ఆదుకున్నాడు. రంజీ క్రికెట్లో ముంబై తరుపున మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన జాఫర్ ఓపెనర్ రుద్ర దండే(166)తో కలిసి మూడో వికెట్కు 281 పరుగులు జోడించాడు.
ఆషే సర్దేశాయ్(24), కెప్టెన్ షామ్స్ ములానీ(87), సిద్దార్థ్ ఆక్రే(20 నాటౌట్) పరుగులతో రాణించడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. అర్మాన్ జాఫర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన వెంటనే ములానీ ముంబై ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎలైట్ గ్రూప్ ఏ, బీ పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఆరో స్థానంలో ఉంది.
2016 జూనియర్ వరల్డ్ కప్ కోసం ప్రకటించిన అండర్-19 జట్టులో అర్మాన్ జాఫర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రోస్టర్లో ఉన్నాడు.