
ఐపీఎల్కు వోక్స్ దూరం?:
జూన్ 4 నుంచి సొంతగడ్డపై ఇంగ్లండ్ రెండు టెస్టు సిరీస్లు ఆడాల్సి ఉంది. తొలుత శ్రీలంకతో, ఆ తర్వాత వెస్టిండీస్తో మూడేసి మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ టెస్టు సిరీసుల్లో రాణించేందుకు వోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. వోక్స్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తాను తప్పుకుంటున్నట్లు ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. వోక్స్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఢిల్లీ పరిశీలిస్తుందట.

రూ.1.50 కోట్లకు కొనుగోలు:
గతేడాది డిసెంబర్ 19న కోల్కతాలో జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రిస్ వోక్స్ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదివరకు కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడిన వోక్స్ 2017లో 17 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. 2018లో ఎక్కువ పరుగులివ్వడంతో అతడు 5 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. అయితే కీలక సమయంలో బ్యాట్తో రాణించగల సామర్థ్యం అతడి సొంతం.

రబడా, ఇషాంత్లకు గాయం:
ఈ నెల 30న డిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ XI పంజాబ్తో తొలి పోరులో తలపడనుంది. కాగా డిల్లీ తుది జట్టులో వోక్స్కు చోటు దక్కుతుందా? లేదా అనేది పక్కనపెడితే.. అతడు దూరమవడం ఆ జట్టుకు మాత్రం ఇబ్బందే. ఇప్పటికే ఢిల్లీ పేసర్లు కగిసో రబడా, ఇషాంత్ శర్మలు గాయాలు బారిన పడటంతో సతమతమవుతోంది. ప్రస్తుతం గాయం కారణంగా రబడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకవేళ తాను ఫిట్ అయితే ఐపీఎల్కు అందుబాటులోకి వస్తానని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు. సుదీర్ఘ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిండంతో ఐపీఎల్లో రబడా ఆడటం అనుమానమే.

వోక్స్ కూడా హ్యాండిస్తే:
ఇక ఇషాంత్ శర్మ కూడా గాయం బారిన పడి కోలుకుంటున్నాడు. ఇటీవలే జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో ఇషాంత్ గాయపడ్డాడు. ఐపీఎల్ ఆరంభ సమయానికి ఇషాంత్ కోలుకుంటాడని ఢిల్లీ ఆశాభావంతో ఉంది. ఈ తరుణంలో వోక్స్ కూడా హ్యాండిస్తే మాత్రం ఢిల్లీ పేస్ బౌలింగ్ విభాగం బలహీనం కావొచ్చు. శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇంగ్లండ్ జట్టులో వోక్స్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మార్చి 19న తొలి టెస్టు జరుగనుంది.


Click it and Unblock the Notifications













