
సెంచరీతో చెలరేగిన క్రిస్లిన్:
తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఖుష్దిల్ షా (70) హాఫ్ సెంచరీ చేయగా.. షాన్ మసూద్ (40) రాణించాడు. లక్ష్య ఛేదనలో క్రిస్ లిన్ శతకంతో చెలరేగడంతో లాహోర్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలో 191 పరుగులు చేసింది. లిన్కు తోడు పాక్ బ్యాట్స్మన్ ఫకర్ జమాన్ (57) హాఫ్ సెంచరీ చేసాడు. పీఎస్ఎల్లో లాహోర్ కలందర్స్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. కలందర్స్ సెమీఫైనల్లో మంగళవారం కరాచీ కింగ్స్ను ఢీకొట్టనుంది.

ఐసోలేషన్కు వెళ్లనున్న లిన్:
ఈ మ్యాచ్ అనంతరం క్రిస్ లిన్ తిరిగి స్వదేశానికి బయలుదేరుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్ కరోనా వైరస్ (కోవిడ్-19 ) కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి నుంచి కఠిన ఆంక్షలు విధించనుంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. దీంతో లిన్ ఆస్ట్రేలియాకు చేరుకున్నాక.. ఐసోలేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. లిన్ ఆసీస్ వెళుతున్న కారణంగా లాహోర్కు భారీ షాక్ తగిలింది.

జీవితం కంటే క్రికెట్ ఎక్కువ కాదు:
లిన్ ఆస్ట్రేలియాకు వెళుతున్న సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టాడు. 'పీఎస్ఎల్లో ఆడటాన్ని ఆస్వాదించా. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న అనివార్య పరిస్థితుల్లో నేను స్వదేశానికి తిరిగి వెళ్తున్నా. ఇలాంటి కఠిన పరిస్థితులలో జీవితం కంటే క్రికెట్ ఎక్కువ కాదని నా అభిప్రాయం. పీఎస్ఎల్ జాయమాన్యానికి, ఆటగాళ్లకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కలందర్స్ టీమ్ పీఎస్ఎల్లో విజేతగా నిలుస్తుంది' అని లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఒక్క పీఎస్ఎల్ మాత్రమే కొనసాగుతోంది:
కరోనా దెబ్బకు ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ఇప్పటికే భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, బంగ్లాదేశ్-పాకిస్తాన్ సిరీస్లు రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వాయిదా పడింది. క్రికెటేతర టోర్నీలు కూడా జరగడం లేదు. ఈ మహమ్మారి దెబ్బకు యావత్ క్రీడాలోకమే అతలాకుతలమైంది. కానీ.. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2020 సీజన్ మాత్రమే కొనసాగుతోంది. అయితే ప్రేక్షకులు లేకుండా జరుగుతుంది.


Click it and Unblock the Notifications












