
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్, ఓపెనర్ క్రిస్ లిన్ ముంబై చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న లిన్.. సిడ్నీ నుంచి నేరుగా ముంబైకి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వారం రోజుల క్వారంటైన్ అనంతరం లిన్ ప్రాక్టీస్ మొదలెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు ముంబై యాజమాన్యం ఏర్పాటు చేసిన హోటల్లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గతకొంతకాలంగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో డికాక్ 16 మ్యాచ్లాడి 140.5 స్ట్రెక్రేట్తో 35.92 సగటుతో 503 పరుగులు చేశాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 2న ప్రారంభమై అదే నెల 16తో ముగుస్తుంది. డికాక్ ప్రొటీస్ సారథిగా ఉండటంతో.. ఆ సిరీస్లో అతను ఆడటం తప్పనిసరి. దీంతో ఐపీఎల్కు డికాక్ రెండు వారాలపాటు దూరమవనున్నాడు. అతని స్థానంలో క్రిస్ లిన్ ఓపెనర్గా ఆడడం ఖాయం అయింది. అందుకే అందరికంటే ముందుగానే ముంబై చేరుకున్నాడు.
2020 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ క్రిస్ లిన్ను ముంబై ఇండియన్స్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. క్వింటన్ డీకాక్ జట్టులో ఉండడంతో లిన్ పూర్తిగా బెంచ్కే పరిమితమయ్యాడు. డీకాక్ రాణించడం, అప్పటికే జట్టులో హేమాహేమీలు ఉండడంతో గతేడాది లిన్ అవసరం ముంబైకి లేకుండా పోయింది. అయితే ఈసారి డీకాక్ లీగ్ ఆరంభ మ్యాచులకు దూరంకానుండడం లిన్కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఒకవేళ భారీగా పరుగులు చేస్తే.. డీకాక్ వచ్చినా ఓపెనర్గా కొనసాగే అవకాశం ఉంది. గత సీజన్ బిగ్ బాష్ లీగ్లో లిన్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో చేరనున్నారు. ఇప్పటికే చెన్నై కిట్ అందుకున్న పుజారా.. చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, సురేష్ రైనాలతో కలసి సాధన చేయనున్నాడు. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ క్యాష్ రిచ్ లీగ్ బరిలోకి దిగనున్నాడు. పుజారా చివరిసారిగా 2014 సీజన్లో పంజాబ్ తరఫున బరిలో దిగాడు. ఆ తర్వాతి వరుసగా 6 సీజన్ల వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2021 వేలంలో నయావాల్ను చెన్నై అతని కనీస ధర రూ. 50 లక్షలకు తీసుకుంది.