మాంఛెస్టర్: ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ ముగిసిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ఇంతకుముందే ప్రకటించాడు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్. ఇప్పుడు నాలుక మడతేశాడు. రిటైర్మెంట్కు ఇంకా సమయం ఉందని అన్నాడు. ప్రపంచకప్ ముగిసిన తరువాత వెస్టిండీస్ పర్యటనకు వచ్చే టీమిండియాతో సిరీస్లో ఆడబోతున్నట్లు వెల్లడించాడు. భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా తమ దేశ పర్యటనకు రానుందని, ఆ సిరీస్లో ఆడతానని అన్నాడు. టీ20 మ్యాచులు మినహా వన్డే, టెస్ట్ సిరీస్లో తాను జట్టు తరఫున ఆడటం ఖాయమైందని చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో గురువారం వెస్టిండీస్ క్రికెట్ జట్టు టీమిండియాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం విండీస్ జట్టు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టిస్ ముగించుకున్న అనంతరం క్రిస్ గేల్ విలేకరులతో మాట్లాడారు. ప్రపంచకప్ తరువాత తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించాడు. నిజానికి- ప్రపంచకప్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ టోర్నమెంట్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతానని క్రిస్ గేల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ నెత్తిన తాజా పిడుగు: కీలక ఆటగాళ్లు టీమిండియాతో మ్యాచ్కు దూరం?
తాజాగా- ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. జట్టు అవసరాల మేరకు తాను భారత క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లో ఆడబోతున్నట్లు చెప్పాడు. జట్టులో తాను ఆడాల్సిన అవసరం కనిపిస్తోందని అన్నాడు. టీ20 మ్యాచ్లు మినహా.. వన్డే, టెస్ట్ మ్యాచ్లల్లో యథాతథంగా ఇన్నింగ్ను ఆరంభిస్తానని పేర్కొన్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత కోహ్లీ సేన విండీస్ పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు, రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడుతుంది టీమిండియా. అమెరికాలోని ఫ్లోరిడా సహా వెస్టిండీస్ దీవుల్లోని ఆంటిగ్వా, జమైకా, గయానా, ట్రినిడాడ్లల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు.