
ఐపీఎల్లో టాప్ బ్యాటర్గా వెలుగొందిన వారిలో క్రిస్ గేల్ ఒకడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో అతను చేరిన తర్వాత గేల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. 2011 నుంచి 2017 వరకు ఆర్సీబీకి తరఫున గేల్ అదరగొట్టినా కూడా ఆ జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడు. గేల్, డివిల్లీర్స్, కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా కూడా ఆర్సీబీ ఎందుకు కప్పు కొట్టలేకపోయిందనేది ఇప్పటికీ అభిమానులకు అంతుచిక్కని సమస్యే. అయితే ఇటీవలి కాలంలో ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
యూనివర్స్ బాస్గా పేరొందిన గేల్.. కొంత కాలం క్రితం మాట్లాడుతూ ఆర్సీబీలో ఆటగాళ్లపై నమ్మకం లేదని, వాళ్లకు లాయల్టీ అంటే తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు అభిమానులు అతన్ని సోషల్ మీడియాలో తెగ రోస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఐపీఎల్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడిన గేల్.. అలాంటి కామెంట్సే చేశాడు. 'జట్టులో ప్రధాన ఆటగాళ్లలో నేనొకడిని. ఫ్రాంచైజీలో మెయిన్ ప్లేయర్లలో ఒకడిని కావడంతో దాదాపుగా నేను నా జోన్లోనే ఉండేవాడిని. అయితే ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. చాలా మంది ఆటగాళ్లు తాము జట్టులో భాగం అని ఫీలయ్యేవారు కాదని నాకు అర్థమైంది' అని గేల్ చెప్పుకొచ్చాడు.
జట్టులో కేవలం ముగ్గురు ఆటగాళ్లకే అటెన్షన్ దక్కిందని అంతా అనుకునేవారని చెప్పాడు. ఈ ముగ్గురూ వేరెవరో కాదు.. గేల్, కోహ్లీ, డివిల్లీర్స్. 'మిగతా ఆటగాళ్లలో చాలా మంది మానసికంగా జట్టులో ఉన్నట్లే ఫీలయ్యేవాళ్లు కాదు. అలాంటి పరిస్థితిలో టైటిల్ గెలవడం ఎప్పుడైనా సవాలే' అని గేల్ వివరించాడు. కోహ్లీ, గేల్, డివిల్లీర్స్ ముగ్గురూ టాప్ ఫామ్లో ఉన్న సీజన్లలో కూడా ఫైనల్ వరకు వచ్చిన ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అయితే ఈసారి మంచి సమతుల్యంతో ఉన్న జట్టు ఎలాగైనా కప్పు కొట్టాలని అనుకుంటోంది.