

హైదరాబాద్: భారత్తో అక్టోబర్ 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్కి వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో వెస్టిండిస్ జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్తో పాటు 5 వన్డేలు, 3 మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
ప్రస్తుతం రాజ్కోట్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. చూస్తుంటే ఈ టెస్టు శనివారంతో ముగిసేలా కనిపిస్తోంది. అనంతరం అక్టోబర్ 12 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్ ఆరంభంకానుంది.
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏఎఫ్ఎల్)లో ఆడేందుకు తాను వన్డే సిరీస్కి అందుబాటులో ఉండనని ఇప్పటికే వెస్టిండిస్ క్రికెట్ బోర్డుకి క్రిస్గేల్ చెప్పగా.. దానికి బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా టెస్టు ఫార్మాట్కి క్రిస్ గేల్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వెస్టిండీస్ తరఫున వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్న క్రిస్గేల్ ఈ ఏడాది జూలైలో చివరిసారి బంగ్లాదేశ్పై వన్డే మ్యాచ్ ఆడాడు. "అప్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు క్రిస్గేల్కి ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల నిరభ్యంతర పత్రాన్ని కూడా జారీ చేసింది" అని జాతీయ మీడియాలో కథనం వచ్చింది.
"అయితే.. దేశం తరఫున ఆడటం కంటే లీగ్లో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్లో క్రిస్గేల్కి జట్టులో చోటుపై గ్యారెంటీ ఇవ్వలేమని బోర్డు స్పష్టం చేసింది" అని అందులో రాసుకొచ్చింది. అయితే, క్రిస్గేల్ మాత్రం వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ ఆడాలని ఉందని చెప్పడం విశేషం.