హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో జరిగే మాన్షి సూపర్ లీగ్కి వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ గుడ్ బై చెప్పాడు. తనకు జట్టులో కనీస గౌరవం, మర్యాద దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే జట్టుకి భారంగా కనిపిస్తానని జమైకాకు చెందిన ఓపెనర్ అన్నాడు.
'బౌలింగ్ గ్రిప్లో మార్పులు చేసుకున్నా.. అందువల్లే వికెట్లు తీస్తున్నా'
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మాన్షి సూపర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్లో జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచులు ఆడగా.. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మొత్తం టోర్నమెంట్లో గేల్కు 50 ప్లస్ స్కోరు ఒకటి మాత్రమే ఉంది. దీంతో మాన్షి సూపర్ లీగ్కి వీడ్కోలు పలుకుతున్నట్లు గేల్ ప్రకటించాడు.
ఇదే సమయంలో క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు. 'తాను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తాను. జట్టులోని సభ్యులు తనను భారంగా భావిస్తున్నారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫ్రాంఛైజీ తరపున క్రికెట్ ఆడుతున్నా. అప్పటి నుంచి పరిశీలించిన తర్వాతే నాకు ఈ విషయం అర్ధం అయింది' అని గేల్ అన్నాడు.
'జట్టులో కనీసం మర్యాద కూడా దక్కడం లేదు. నేను గతంలో ఏమి చేశానో వాళ్లకు గుర్తుంచుకోవడం లేదు. అయితే నేను ఫ్రాంఛైజీ గురించి మాట్లాడటం లేదు, జనాలు ఏమనుకుంటున్నారో మాత్రమే చెబుతున్నా. ఒక్కసారి గేల్ విఫలం అయితే.. ఇక అతని కెరిర్ ముగిసిపోయినట్లే, అతను మంచి ప్లేయర్ కాదు లాంటి లాంటి కామెంట్స్ నాపై వస్తున్నాయి' అని గేల్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్ 2019 అనంతరం 40 ఏళ్ల గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇప్పటివరకు కూడా రిటైర్మెంట్ ఇవ్వలేదు. ప్రపంచకప్లో పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ఆడిన సిరీసులలో కూడా తన మార్క్ చూపించలేదు. దీంతో అతడు విండీస్ జట్టుకు దూరమయ్యాడు.