ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో గురువారం ముంబై వాంఖడె స్టేడియంలో జరగనున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్లో భారత్, వెస్టిండిస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించి పైనల్ మ్యాచ్కు చేరాలని ఇరుజట్లు కఠోర శిక్షణ చేస్తున్నాయి.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాతి ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. ఇక వెస్టిండిస్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి చివరి మ్యాచ్లో అండర్ డాగ్ ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది.
టోర్నీలో ఇరు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వెస్టిండిస్ జట్టు 550 పరుగులు చేయగా, టీమిండియా 505 పరుగులు సాధించింది. దీంతో సెమీస్లో ఇరు జట్లకు విజయఅవకాశాలు సమానంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

సాయంత్రం 7 గంటలకు ఆరంభం కానున్న ఈ మ్యాచ్లో అందరి కళ్లు ఇద్దరిపైనే ఉన్నాయి. వెస్టిండిస్ జట్టులో క్రిస్గేల్, టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీ. టీ20 మ్యాచ్ల్లో సిక్సర్లు కొట్టడంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన క్రిస్గేల్ ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తే వెస్టిండిస్ గెలుపు ఖాయమని అంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ అరుదైన రికార్డుని సొంతం చేసుకోనున్నాడు. ఇంకో రెండు సిక్సర్లు కొడితే టీ20ల్లో 100 సిక్సులు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రిస్ గేల్ అవతరించనున్నాడు. క్రిస్ గేల్ ఇప్పటి వరకు ఆడిన 48 మ్యాచుల్లో 98 సిక్సర్లు కొట్టాడు.
మరోవైపు ధోని కూడా ఈ మ్యాచ్లో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. ఒక వికెట్ డిస్మసల్ చేస్తే వికెట్ కీపింగ్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఘనత ధోనీ సొంతమవుతుంది. ఇప్పటివరకు 60 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోని 60 డిస్మిసల్స్ చేశాడు.