హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్కు విండిస్ వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల కోహ్లీసేనతో జరిగిన టీ20 మ్యాచ్లో ఆడిన క్రిస్ గేల్ రెండేళ్ల తర్వాత వన్డే ఆడనున్నాడు. 2015 మార్చిలో చివరిసారిగా క్రిస్ గేల్ వెస్టిండిస్ తరుపున వన్డే ఆడాడు.
ఆ తర్వాత ఇన్నాళ్లకు గేల్కు సెలక్టర్లు వన్డే జట్టులో చోటు కల్పించారు. మరో ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ ఏడాది తర్వాత విండిస్ తరుపున పునరాగమనం చేయనున్నాడు. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది.
ఈ జట్టులో గేల్తో పాటు మార్లోన్ శామ్యూల్స్ను సెలక్టర్లు చోటు కల్పించారు. 2016 అక్టోబర్లో శామ్యూల్స్ విండిస్ తరుపున చివరి వన్డే ఆడాడు. క్రికెట్ వెస్టిండీస్ ఎంపిక నిబంధనలు మారడంతో వీరి ఎంపిక సులభమైంది. ఈ ఇద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని విండిస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు.
వీరి అనుభవం యువ క్రికెటర్లకు లాభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. స్థానిక మ్యాచ్లు ఆడుతున్నందున సునీల్ నరైన్ను, 100 శాతం ఫిట్నెస్ లేకపోవడం వల్ల డ్వేన్ బ్రావోను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బ్రేవో పునరాగమనం చేసే అవకాశం ఉందని అన్నారు. ఆగస్టు 25 నుంచి ఇంగ్లండ్-వెస్టిండిస్ జట్ల మధ్య వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.