హైదరాబాద్: క్రిస్ గేల్ విధ్వంసానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ లో రెండో మ్యాచ్ ఆడుతున్న గేల్.. తొలి మ్యాచ్లో చెన్నైపై హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇప్పుడు సన్రైజర్స్పై జూలు విదిల్చి యూనివర్సల్ బాస్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. తొలి మ్యాచ్లో 63 పరుగులు చేసిన గేల్.. మలి మ్యాచ్లో 63 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో సిక్స్ల మోత మోగించిన గేల్.. పంజాబ్కు భారీ స్కోరు అందించాడు. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో సన్రైజర్స్ 150కి మించి పరుగులు ఇచ్చుకోలేదు. కానీ గేల్ దెబ్బకు సన్రైజర్స్ 193 పరుగులు ఇచ్చుకుంది. హైదరాబాద్పై అజేయ శతకంతో సత్తా చాటిన గేల్ సెంచరీని శుక్రవారం బర్త్ డే జరుపుకోబోతున్న తన గారాల పట్టికి అంకితం ఇచ్చాడు.
కానీ గేల్ విధ్వంసం ధాటికి సన్రైజర్స్ బౌలర్లు చేతులేత్తేశారు. ముఖ్యంగా స్పిన్నర్ రషీద్ ఖాన్ లక్ష్యంగా గేల్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో మొత్తం 11 సిక్స్లు బాదిన గేల్.. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు సహా.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఆరు సిక్స్లు బాదాడు. కోల్కతా ఆటగాడు రసెల్ చెన్నైతో జరిగిన మ్యాచ్లో బ్రావో ఓవర్లో ఆరు సిక్స్లు బాదగా.. తర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో షమీ లక్ష్యంగా ఆరు సిక్స్లు బాదాడు. ఈ రికార్డులను గేల్ సమం చేశాడు.
2011 వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. డిర్క్ నన్నేస్ స్థానంలో ఆర్సీబీ గేల్ను తీసుకోగా.. తొలి మ్యాచ్లోనే కోల్కతాపై శతకంతో సత్తా చాటాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ గేల్ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. చివర్లో రూ.2 కోట్ల ప్రారంభ ధరకే ప్రీతి జింతా అతణ్ని కొనుగోలు చేసింది. అదే కసితో కనిపిస్తోన్న గేల్ ఈ సీజన్లో వరుసగా 66, 104 పరుగులు చేసి సత్తా చాటాడు.