హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే వినోదం. ప్రతి ఏటా భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. హాట్ సమ్మర్లో క్రికెటర్లు అందించే వినోదంతో రెండు నెలల పాటు ఫాన్స్ చిల్ అవుతుంటారు. బ్యాట్స్మన్ ఫోర్లు, సిక్సులు బాధగానే మైదానాన్ని హోరెత్తిస్తుంటారు. ఇక ఉండేది 20 ఓవర్లే కాబట్టి బ్యాట్స్మన్ కూడా బౌండరీలు బాదేందుకే చూస్తుంటాడు. అయితే ఐపీఎల్ టోర్నీలో బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు చేసింది విండీస్ హార్డ్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. బౌండరీల ద్వారా గేల్ ఇప్పటివరకు 3754 రన్స్ చేశాడు.
నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే: బుమ్రా
ఐపీఎల్ టోర్నీలో 140 మ్యాచులు ఆడిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ 4950 రన్స్ చేశాడు. 4950 పరుగులలో బౌండరీల (ఫోర్లు, సిక్సులు) ద్వారా సాధించినవే 3754. రెండో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 199 మ్యాచుల్లో 6076 రన్స్ చేసిన కోహ్లీ.. బౌండరీల సాయంతో 3326 పరుగులు చేశాడు. సన్రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (3306), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (3248), ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ శిఖర్ ధావన్ (3232) టాప్-5లో ఉన్నారు. టాప్-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (3220), మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (3094) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
పలు జట్లలో కరోనా వైరస్ కేసులు నమోదవడంతో ఐపీఎల్ 14వ సీజన్ను మార్చి 4న బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కోల్కతాలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. హైదరాబాద్లో వృద్ధిమాన్ సాహా.. ఢిల్లీలో అమిత్ మిశ్రా.. చెన్నైలో లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ పాజిటివ్గా తేలారు. ఐపీఎల్ బయో బుడగ బలహీనమవ్వడంతో 14వ సీజన్ను బీసీసీఐ వాయిదా వేసింది. ఆ తర్వాత మరికొందరు ఆటగాళ్లు, సిబ్బందికి పాజిటివ్ రావడం గమనార్హం. అయితే ఇప్పుడు అందరూ కోలుకున్నారు.
ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్లకు గాను.. లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని స్వయంగా సౌరవ్ గంగూలీనే తెలిపారు. ఈ నేపథ్యంలో సీజన్ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్లో టీ20 ప్రపంచకప్నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కావున అంతకంటే ముందే సెప్టెంబర్లో మిగిలిన సీజన్ను నిర్వహించే వీలుంది. అయితే అప్పుడు కూడా దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగితే.. లీగ్తో పాటు టీ20 ప్రపంచకప్నూ ఇక్కడి నుంచి తరలించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది.