యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఏం మారలేదు. 44 ఏళ్ల వయస్సులోనూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్-2024లో గేల్ విజృంభిస్తున్నాడు. ఆదివారం సౌతాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ 40 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో హోరెత్తించాడు.
గేల్తో పాటు వికెట్ కీపర్ చాద్విక్ వాల్టన్ (56 నాటౌట్; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా అర్ధశతకంతో చెలరేగడంతో సౌతాఫ్రికా ఛాంపియన్స్పై వెస్టిండీస్ ఛాంపియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 174 పరుగులు చేసింది. అష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్; 35 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), డేన్ విలాస్ (44 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటారు.

కెప్టెన్ జాక్వెస్ కలిస్ (18; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) నిదానంగా ఆడాడు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గేల్ ఆది నుంచే తనశైలిలో దూకుడుగా ఆడాడు. డేల్ స్టెయిన్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదించిన గిల్ నాలుగో ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి జోరు అందుకున్నాడు.
ఈ క్రమంలో గేల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరింత చెలరేగాడు. తాహిర్, వాల్టన్ ఓవరల్లో రెండేసి సిక్సర్లు బాదాడు. అయితే గేల్ను చార్ల్ ఔట్ చేసి దక్షిణాఫ్రికాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. కానీ వాల్టన్ హిట్టింగ్ చేస్తూ వెస్టిండీస్ను విజయతీరాలకు చేర్చాడు.
జులై 13 వరకు జరగనున్న వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్లో ఆరు దేశాలు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతున్నాయి. ప్రతి జట్టు అయిదు మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఇండియా రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. భారత్ ఛాంపియన్స్కు హర్భజన్ నాయకత్వం వహిస్తున్నాడు.