కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం భద్రతా పరంగా తీవ్ర ఆందోళన కలిగించే ఘటనకు వేదికగా మారింది. ఏప్రిల్ 24న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని సీసీటీవీ నిఘా వ్యవస్థను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. దీనివల్ల ఏకంగా 240 కెమెరాలు పనిచేయకుండా పోవడంతో,మ్యాచ్ సమయంలో కీలకమైన సెక్యూరిటీ జోన్లలో నిఘా వ్యవస్థ స్తంభించిపోయింది. వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యే ఇలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్లో నిఘా లేకపోవడం పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిందితులు వీరే..
ఈ కేసులో నిందితులుగా చిత్రదుర్గ జిల్లాకు చెందిన మంజునాథ్(37), యూపీకి చెందిన అబ్దుల్ కలాం(19)లను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వీరు ఐవీఎస్ (IVS) డిజిటల్ సొల్యూషన్స్ అనే సంస్థ కింద సబ్-వెండర్లుగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ మ్యాచ్ రోజుల్లో స్టేడియంలో డిజిటల్ సేవలను అందిస్తుంది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ సరైన పాస్లు లేకుండానే నిషిద్ధ ప్రాంతమైన సీసీటీవీ కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న నెట్వర్క్ వీడియో రికార్డర్ (NVR) సిస్టమ్లను, కీలకమైన ఫైబర్ కనెక్షన్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి.. మొత్తం నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

డబ్బుల వివాదమే కారణమా?
పోలీసు విచారణలో నిందితులు వెల్లడించిన కారణాలు పోలీసులను షాక్కు గురిచేశాయి. తాము చేసిన పనికి సంబంధించి సుమారు రూ. 10 లక్షల బకాయిలు తమకు రావాల్సి ఉందని, వాటిని చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని వారు పేర్కొన్నారు. పదేపదే అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతోనే.. కసి తీర్చుకోవడానికి ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. కేవలం ఆర్థిక లావాదేవీల గొడవ వల్ల ఏకంగా స్టేడియం భద్రతనే పణంగా పెట్టడం అధికారులను విస్మయానికి గురిచేసింది. దీనివల్ల స్టేడియం ఎంట్రీ గేట్లు, పార్కింగ్ ప్రాంతాలు, గ్యాలరీల్లో నిఘా లేకుండా పోయింది.
భద్రతపై తీవ్ర ప్రభావం
ఈ విధ్వంసం కారణంగా స్టేడియం ఎంట్రీ గేట్లు, పార్కింగ్ ప్రాంతాలు, గ్యాలరీల్లో అమర్చిన కెమెరాలు మొరాయించాయి. దీనివల్ల భద్రతా విధుల్లో ఉన్న పోలీసులకు లైవ్ ఫీడ్ అందలేదు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే గుర్తించే అవకాశం లేకుండా పోవడంతో భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టేడియం అంతటా ఏఐ (AI) ఆధారిత నిఘా సేవలు అందించే స్టాక్యూ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి ఆదిత్య భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో తొక్కిసలాటలో 11 మంది మృతి
చిన్నస్వామి స్టేడియం వద్ద గతంలో జరిగిన విషాదం ఇంకా పచ్చిగానే ఉంది. గతేడాది ఆర్సీబీ జట్టు విజయోత్సవాల వేళ దాదాపు 5 లక్షల మంది అభిమానులు ఒక్కసారిగా స్టేడియం పరిసరాలకు చేరుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఏప్రిల్ 24 మ్యాచ్ను రద్దు చేయాలని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. నిఘా కెమెరాలు లేని స్టేడియంలో లక్ష మంది ప్రాణాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరించారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయి ఉంటే, అది కేవలం ఆర్థికంగానే కాకుండా ఆర్సీబీ ప్రతిష్టకు పెద్ద దెబ్బ అయ్యేది. టికెట్ల రీఫండ్, బ్రాడ్కాస్టర్ల నష్టం, అభిమానుల ఆగ్రహం వల్ల బెంగళూరులో శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉండేది.
మరోవైపు 11 మంది ప్రాణాలు పోయినా, నిఘా వ్యవస్థలు ధ్వంసమవుతున్నా స్టేడియం యాజమాన్యం, జట్టు నిర్వాహకులు భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిమానాలు, నోటీసుల కంటే అభిమానుల ప్రాణాలకు విలువివ్వాలని క్రీడా ప్రేమికులు కోరుతున్నారు.