హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ను పూర్తిగా మార్చివేసిన క్యాష్ రిచ్ టోర్నీ. ఈ టోర్నీని ఆదర్శంగా తీసుకుని టీ20 ఫార్మాట్లో అనేక దేశాలు లీగ్లను ప్రారంభాయి. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, వెస్టిండిస్లో కరేబియన్ లీగ్, బంగ్లాదేశ్లో బంగ్లా ప్రీమియర్ లీగ్ ఇలా ఎన్నో లీగ్లు పుట్టుకొచ్చాయి.
అయితే, వీటన్నింటిలో ఐపీఎల్ బాగా సక్సెస్ అయింది. ఐపీఎల్ ద్వారా అనేక మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ ద్వారా ఆప్ఘనిస్థాన్ లాంటి చిన్నదేశాల్లోని క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న రషీద్ ఖాన్ ఇలా వెలుగులోకి వచ్చినవాడే.
ఐపీఎల్ 11వ సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించిన వేలంలో నేపాల్కు చెందిన సందీప్ లమిచానేని ఢిల్లీ డేర్డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో నేపాల్ నుంచి ఐపీఎల్ ఆడబోతున్న తొలి క్రికెటర్గా సందీప్ లమిచానే చరిత్ర సృష్టించాడు.
తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దుబాయి వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఎలాగైతే ఆప్ఘన్, నేపాల్ దేశాలకు చెందిన యువ క్రికెటర్లకు ఐపీఎల్లో అవకాశం కల్పించిందో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైనా క్రికెటర్లుకు అవకాశం కల్పించింది.
ఇందులో భాగంగా చైనాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించేందుకు గాను ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న యుఫీ జాంగ్, జియాన్ లీలను పెషావర్ జల్మీ అనే ప్రాంఛైజీ గతేడాది సొంతం చేసుకుంది. పీఎస్ఎల్ మూడో సీజన్లో భాగంగా చైనాకు చెందిన ఇద్దరు యువ ఆటగాళ్లు పెషావర్ జల్మీ జట్టు తరుపున బరిలోకి దిగనున్నారు.
ఇప్పటికే పెషావర్లో జట్టు కోసం ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపుకు చేరుకున్నారు. గురువారం షార్జా వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. పీఎస్ఎల్ ద్వారా ఈ ఇద్దరు ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి వస్తుందని పెషావర్ జల్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
చైనాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించేందుకు గాను పాకిస్థాన్ మెంటార్గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చైనాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు పీఎస్ఎల్లో చోటు కల్పించింది. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో చైనాకు సభ్యత్వం వచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత ఆసియా కౌన్సిల్ క్రికెట్ ఛాలెంజ్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ని ఆడింది.