సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు సెలెక్టర్లు చోటు కల్పించారు. తద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే భారత జట్టు తరఫున రుతురాజ్ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు. రెండు మ్యాచ్ల్లో కలిపి 38 పరుగులు చేశాడు. అయితే తాజాగా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. దేశవాళీ మ్యాచ్ల్లో రుతురాజ్ అద్భుతంగా ఆడుతున్నాడని అందుకే టీమిండియాకు సెలెక్టు చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇప్పటికే అతను భారత జట్టు తరఫున టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడని, వన్డేల్లో కూడా ఆడడానికి అతనికి అర్హత ఉందని భావించామని తెలిపారు. అయితే తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది జట్టు మేనేజ్మెంట్ చూసుకుంటుందని చేతన్ శర్మ చెప్పారు. అలాగే అతన్ని ఏ స్థానంలో పంపాలనేది కూడా కోఆర్టినేట్ చేసుకుంటామని తెలిపారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తాడని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారత జట్టు కోసం రుతురాజ్ అద్భుతాలు చేస్తాడని తాము భావించినట్టు టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వెల్లడించారు.
24 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నిలిచాడు. మొత్తం 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా చెన్నై జట్టు ట్రోఫి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇటీవల ఆడిన విజయ్ హజారే ట్రోఫిలో కూడా చెలరేగాడు. 5 మ్యాచ్ల్లో 603 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 168 పరుగులు. ఐపీఎల్లో ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 46 సగటుతో 839 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 101 పరుగులు.
కాగా శనివారం సెలెక్టర్లు సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్కు 18 మందితో కూడిన జట్టును ప్రకటించారు.
ఈ సిరీస్కు గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సెలెక్టర్లు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించడం విశేషం.
భారత జట్టు:
కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రీతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, పంత్, ఇషాన్ కిషన్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహరమ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్.