
హైదరాబాద్: టీమిండియా టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుడ్ న్యూస్తో కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పుజారా తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 5న మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్టౌన్ వేదికగా టీమిండియా శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో పుజారా తన భార్య పూజాతో దక్షిణాఫ్రికా చేరుకున్నారు.
తాజాగా పుజారా ట్విటర్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తాను ఈ ఏడాది తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. 'ఈ ఏడాది మాలో మరికొంత సంతోషం నిండనుంది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నాం. ఆశీర్వదించండి' అని పుజారా ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా గర్భవతి అయిన తన భార్య పూజాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. వన్డే, టీ20 జట్టులో చోటు దక్కకపోయినా.. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న పుజారా 2013లో దక్షిణాఫ్రికా పర్యటనతోనే వెలుగులోకి వచ్చాడు. సఫారీ గడ్డపై పుజారా టెస్టు సగటు 44.42 కాగా.. అత్యధిక స్కోరు జోహనెస్బర్గ్లో బాదిన 153 పరుగులు.
టెస్టు సిరీస్ ముగియగానే పుజారా భారత్కి పయనం కానున్నాడు. అనంతరం టీమిండియా ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటి వరకు ఒక టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. దీంతో ఈ మూడు టెస్టుల సిరీస్ని గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.