458 పరుగులతో టాప్ స్కోరర్గా
ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్ లాడిన పుజారా 458 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. సిడ్నీ టెస్టులో పుజారా చేసిన సెంచరీ ఆస్ట్రేలియాపై మొత్తంగా ఐదోది కావడం విశేషం. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఎడ్జిబాస్టన్ టెస్టు నుంచి పుజారాను తప్పించిన సంగతి తెలిసిందే.
పుజారా ప్రదర్శనలో చాలా మార్పు
అయితే, ఆ తర్వాత పుజారా ప్రదర్శనలో చాలా మార్పు వచ్చింది. క్రీజులో పాతుకుపోయి ఎంతో ఓపికగా, సహనంతో బౌలర్లను ఎదుర్కొంటూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఎడ్జిబాస్టన్ టెస్టు తర్వాత పుజారా నాలుగు టెస్టు సెంచరీలు సాధించాడు. ప్రస్తుత ఆసీస్ సిరిస్లో టీమిండియా గెలిచిన అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టులకు కారణంగా పుజారా సెంచరీలే.
పుజారాపై కోహ్లీ ప్రశంసలు
మెల్ బోర్న్ టెస్టు అనంతరం పుజారా ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత సిరిస్లో పుజారా 500 పరుగులకు చేరువయ్యాడు. సిడ్నీ టెస్టు సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు.
సచిన్ రికార్డు బద్దలు
ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(195) తొలి స్థానంలో ఉండగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మురళీ విజయ్(144), సునీల్ గావస్కర్(132)లు ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని పుజారా ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో తొలి రోజు ఆటలో సచిన్ టెండూల్కర్(124) నమోదు చేసిన రికార్డును పుజారా అధిగమించాడు.