9 గంటల పాటు క్రీజులో
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో పుజారా మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరిస్లో పుజారా ఇప్పటి వరకు ఎదుర్కొన్న బంతులు 1258. ఒక్క సిడ్నీ టెస్టులో 373 బంతుల్లో 193 పరుగులు చేశాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మొత్తం 9 గంటల 8 నిమిషాల పాటు పుజారా క్రీజులో ఉండటం విశేషం. ఈ క్రమంలో పుజారా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డుని బద్దలు కొట్టాడు.

ద్రవిడ్ రికార్డు బద్దలు
2003-4లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన రాహుల్ ద్రావిడ్ మొత్తం 1203 బంతులను ఎదుర్కొన్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 51.45 సగటుతో 619 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ.. మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక బంతులను ఎదుర్కొన్న పర్యాటక జట్టు బ్యాట్స్మెన్లలో పుజారా(1258) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
ఆసీస్ గడ్డపై రిషబ్ పంత్ రికార్డు
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో ఆసీస్ పర్యటనలో చేసిన 89 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. ఇప్పుడు పంత్ ఆ రికార్డుని అధిగమించాడు.

సచిన్ తర్వాత పిన్న యవస్కుడిగా
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో సచిన్ తర్వాత సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషబ్ పంత్ రికార్డుల్లో నిలిచాడు. 1992లో కేవలం 18 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ వరుసగా సిడ్నీ (148 నాటౌట్), పెర్త్ (114) స్టేడియాల్లో సెంచరీ సాధించగా 21ఏళ్ల పంత్ తాజాగా సచిన్ తర్వాత ఈ జాబితాలో నిలిచాడు.

ధోని రికార్డుని బద్దలు కొట్టిన పంత్
ఆసియా వెలుపల ఇప్పటి వరకూ టెస్టుల్లో సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ల జాబితాని పరిశీలిస్తే.. 1959లో వెస్టిండీస్పై వి.మంజ్రేకర్ 118 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2002లో వెస్టిండీస్పై ఎ.రత్రా 115 పరుగులు, 2016లో వెస్టిండీస్పై సాహా 104 పరుగులు చేయగా.. 2018లో ఇంగ్లాండ్పై 114 పరుగులు చేసిన రిషబ్ పంత్.. 2006లో ఫైసలాబాద్ వేదికగా జరిగిన టెస్టులో పాక్పై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని చేసిన 148 పరుగుల రికార్డుని సైతం రిషబ్ పంత్(159 నాటౌట్) అధిగమించాడు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో 600కుపైగా మూడోసారి
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా 600కుపైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. తద్వారా ఈ గ్రౌండ్లో అత్యధికంగా మూడు సార్లు 600కుపైగా పరుగులు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. ఈ గ్రౌండ్లో టీమిండియా అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్. ఈ స్కోరుని 2003-04 పర్యటనలో చేసింది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో టీమిండియా చేసిన 622/7 డిక్లేర్డ్ పరుగులు రెండో స్థానంలో నిలిచింది. గతంలో 1985-86 పర్యటనలో టీమిండియా చేసిన 600/4 డిక్లేర్డ్ మూడో స్థానంలో నిలిచింది.
ఏడో వికెట్కు పంత్-జడేజా 204 పరుగులు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్లో పంత్-జడేజా జోడి ఏడో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు ఈ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఆసీస్ గడ్డపై ఏ జట్టుకైనా ఏడో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అంతేకాకుండా భారత్ తరఫున ఏడో వికెట్కు ఇది ఆరో అత్యధిక భాగస్వామ్యం. భారత్ తరఫున ఏడో వికెట్కు అత్యధిక పరుగల భాగస్వామ్యం వీవీఎస్ లక్ష్మణ్, అజయ్ రాత్రా పేరిట ఉంది. వీరిద్దరూ వెస్టిండీస్పై 7వ వికెట్కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాటు 1983లో పాక్పై మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆసీస్ ప్లేయర్లు ఏడో వికెట్కు గ్రాహం యలోప్-గ్రెగ్ మ్యాథ్యూస్ నెలకొల్పిన 185 పరుగుల రికార్డు కనుమరుగైంది.
నాథన్ లియాన్ అరుదైన ఘనత
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా సిడ్నీ టెస్టులో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 242.1 ఓవర్లు.. అంటే 1452 బంతులు వేశాడు. 1970 తర్వాత నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఓ ఆస్ట్రేలియా బౌలర్ అత్యధిక బంతులేయడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.


Click it and Unblock the Notifications












