
హైదరాబాద్: ప్రత్యక్షంగా ఎదురైతే పరిస్థితేంటో కానీ, సోషల్ మీడియాలో కనిపించిన ప్రతీసారి ధావన్ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడూ ఆడుతూపాడుతూ సరదాగా కనిపించే ధావన్.. బ్యాటింగ్లో అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతో అతని ప్రతి పోస్టుపై నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఎసెక్స్ జట్టుతో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్లో శిఖర్ ధావన్ రెండు ఇన్నింగ్స్ల్లో డకౌట్గా నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, నయావాల్ చతేశ్వర పుజారాలతో కలిసి ఫీల్డింగ్ చేసిన ఓ ఫొటోను గబ్భర్ అభిమానులతో పంచుకున్నాడు. దీనికి పుజారా, కోహ్లిలు ఉండగా.. బంతి ఎక్కడికి పోతుందనే అర్థం వచ్చేలా హిందీలో ఓ కవితాత్మక క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్పై అభిమానులు మండిపడుతున్నారు. ముందు ఈ ముచ్చట్లు ఆపి పరుగులు చేయమని ఘాటుగా బదులిస్తున్నారు. పరుగులు చేయకపోతే జట్టు నుంచి పోతావ్ అని అదే ప్రాసలో పంచ్లు విసురుతున్నారు.
ఇక అంతక ముందు ధావన్ షేర్ చేసిన ప్రాక్టీస్ వీడియోకు కూడా ఇలానే నెగటీవ్ కామెంట్స్ వచ్చాయి. భారత క్రికెటర్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న క్రమంలో స్థానిక అభిమానులు భాంగ్రా నృత్యాలతో స్వాగతం పలికారు. ముందుగా మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ భాంగ్రా స్టెప్పులేస్తూ కనిపించాడు.
ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శిఖర్ ధావన్ కూడా తనదైన శైలిలో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ వెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ వార్మప్ మ్యాచ్లో బాట్స్మెన్ ఆధిపత్యం చూపెట్టినా.. బౌలర్లు కూడా తీవ్రంగానే శ్రమించారు.